KTR Language: కేటీఆర్ గీత దాటే భాషతో బీఆర్ఎస్కు పోతున్న మైలేజీ - ప్రభుత్వంపై పోరాడుతున్నా పుంజుకోలేకపోతోంది ఇందుకేనా?
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వాడుతున్న భాష వివాదాస్పదం అవుతోంది. అది ప్రభుత్వం పై బీఆర్ఎస్ పోరాటాన్ని తక్కువ చేస్తోంది.

KTR controversial language: తెలంగాణ రాజకీయాల్లో పదజాలం, విమర్శల స్థాయి రోజురోజుకూ దిగజారుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరంగల్ రైతు సభ వంటి వేదికలపై వాడుతున్న భాష రాజకీయ వర్గాల్లోనే కాక, సామాన్య ప్రజల్లోనూ విస్మయాన్ని కలిగిస్తోంది.
నిరసనను కమ్మేస్తున్న బూతుల పర్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో, హామీల అమలులో జాప్యంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. ఈ ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి క్షేత్రస్థాయిలో సభలు పెడుతున్నప్పటికీ, ఆ వేదికలపై సమస్యల కంటే వ్యక్తిగత దూషణలే హైలైట్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న అత్యంత అసభ్యకరమైన పదజాలం వల్ల, ఆ సభల వెనుక ఉన్న అసలు ఉద్దేశం పక్కదారి పడుతోంది. మీడియాలో కూడా ఆయన లేవనెత్తిన పాయింట్ల కంటే, ఆయన వాడిన బూతులు మాత్రమే వార్తల్లో నిలుస్తున్నాయి.
మైలేజీని తగ్గించేస్తున్న వ్యక్తిగత దూషణలు
సాధారణంగా ప్రభుత్వంపై పోరాటం చేసేటప్పుడు హుందాతనం పాటిస్తేనే తటస్థ ఓటర్ల మద్దతు లభిస్తుంది. కానీ, కేటీఆర్ వాడిన పదజాలం వల్ల బీఆర్ఎస్ కు రావాల్సిన సానుకూల మైలేజీ రాకపోగా, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎంత దారుణంగా తిడితే అంత గట్టిగా పోరాడినట్లు అనే భ్రమలో కేటీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది దీర్ఘకాలంలో పార్టీకి నష్టదాయకమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేటప్పుడు వాడాల్సిన గొంతు కంటే, వ్యక్తులను కించపరిచే గొంతు పెద్దదైతే అది ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తుంది.
సంస్కారంపై విమర్శలు
కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క వంటి వారు కేటీఆర్ సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి, విదేశాల్లో చదువుకున్న వ్యక్తి వాడే భాష ఇదేనా అని వారు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తుండటంతో, తెలంగాణ రాజకీయం ప్రజా సమస్యల చర్చ నుంచి బూతుల యుద్ధం గా మారిపోయింది. దీనివల్ల ప్రజలకు అందాల్సిన స్పష్టత కరువై, కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగులుతోంది.
ప్రతిపక్ష వ్యూహం మారకపోతే ఇబ్బందే!
ఒకప్పుడు ఉద్యమ సమయంలో వాడిన భాషకు, ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వాడాల్సిన భాషకు చాలా తేడా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేలా చేయాలనుకుంటే, విధానపరమైన లోపాలను ఎండగట్టాలి. కానీ, కేటీఆర్ అనుసరిస్తున్న ఈ అసభ్యకర విమర్శల వ్యూహం పరోక్షంగా కాంగ్రెస్కే మేలు చేస్తోంది. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని చర్చించాల్సిన ప్రజలు, ఇప్పుడు కేటీఆర్ భాష గురించి చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, బీఆర్ఎస్ ఒక బలమైన రాజకీయ శక్తిగా కంటే, కేవలం ఒక విమర్శక బృందంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజలు ఆశిస్తున్నది ఏమిటి?
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. వారు హుందాతనం ఉన్న నాయకత్వాన్ని కోరుకుంటారు. రేవంత్ రెడ్డి లాంగ్వేజ్లోనే సమాధానమిస్తున్నామని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటూ ుంటారు. రైతుల రుణమాఫీ, బోనస్, నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ఈ అసభ్యకర భాష తోడైతే, ఆ పోరాటం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకత్వం తమ భాషా శైలిని మార్చుకుని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నిలబడాలన్న సూచనలు ప్రజాస్వామ్య వాదుల నుంచి వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















