Telangana Politics: రేవంత్ , రాహుల్పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు - భగ్గుమన్న కాంగ్రెస్
KTR comments: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భాషా యుద్ధం తారాస్థాయికి చేరింది. వరంగల్ వేదికగా జరిగిన రైతు సంగ్రామ సదస్సు లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

KTR controversialcomments on Revanth and Rahul: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. వరంగల్లో రైతు సంగ్రామ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద పదజాలం వాడటం రాజకీయ వివాదానికి దారి తీసింది. రాహుల్ గాంధీని మోసగాడు అని, కాంగ్రెస్ నాయకులను రైతు రక్తం తాగే దొంగలు అని సంబోధించారు. అంతటితో ఆగకుండా, ఎన్నికల హామీలు అమలు చేయనందుకు వారిని ఉరితీయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి రైతులను కాంగ్రెస్ దగా చేసింది.. ఈ దొంగలను నమ్మొద్దు అంటూ కేటీఆర్ చేసిన ప్రసంగం పొలిటికల్ హీట్ పెంచింది.
భాష, భాష, భాష ... రేవంతైనా, కేటీఆర్ ఐనా.. pic.twitter.com/FX0W9D81V5
— 𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚 (@pradeeepjourno) May 6, 2026
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు కౌంటర్
కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేటీఆర్ తన సంస్కారాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మీ పదేళ్ల పాలనలో రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో ఆత్మవిమర్శ చేసుకోవాలి అని హితవు పలికారు. కేటీఆర్ భాషను చూస్తుంటే ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అర్థమవుతోందని, బూతులు తిడితే నాయకుడు కాలేరని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.
టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/hlGWWIryNh
— Telangana Congress (@INCTelangana) May 6, 2026
*రాజకీయాల్లో జోకర్ కావద్దు - మంత్రి సీతక్క హెచ్చరిక
మంత్రి సీతక్క సైతం కేటీఆర్ వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చదువుకున్న వారు, కొంత మంచి పేరున్న వారు.. ఇలాంటి వెకిలి వ్యాఖ్యలు చేసి జోకర్ కావద్దు అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తుంటే, ఓర్వలేక విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కేటీఆర్కు అధికారం పోయిందని పిచ్చి పట్టింది, అందుకే బూతులు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ వంటి నాయకుడిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు అని సీతక్క స్పష్టం చేశారు.
రాను రాను దిగారిపోతున్న భాష
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టడం రాజ్యాంగబద్ధమైన హక్కు. కానీ, ఆ నిరసనను వ్యక్తులపై బూతులతో చేయడం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతోంది. వరంగల్ సభలో రైతుల రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై క్షేత్రస్థాయి ఆధారాలతో కేటీఆర్ మాట్లాడి ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేదని.. కానీ, ఆయన వాడిన భాష వల్ల ఇప్పుడు చర్చంతా కేటీఆర్ సంస్కారం చుట్టూనే తిరుగుతోందని అంటున్నారు. ఫ్రస్ట్రేషన్ తో తిడితే ప్రజల్లో సానుభూతి రాదని, అది కేవలం రాజకీయ రచ్చకు మాత్రమే దారితీస్తుందని అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















