KCR Strategy On Ghosh Committee Report: కాళేశ్వరంపై KCR వ్యూహాలు: BRS రాజకీయ భవిష్యత్తుకు పరీక్ష! ఘోష్ నివేదిక తర్వాత ఏం చేయబోతున్నారు?
BRS: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ కమిటీ నివేదిక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసిన సానుకూల ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. కేసీఆర్ ఏం చేస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

KCR Strategy On P.C. Ghosh Committee Report : జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిటీ నివేదిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత డిఫెన్స్లో పడిందనే చెప్పాలి. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల్లో గొప్ప ఇంజినీరింగ్ కట్టడంగా కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. మీడియాలో సైతం చాలా సానుకూల కథనాలు వచ్చాయి. అలాంటిది, అధికారం చేతులు మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ఇమేజ్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిటీ నివేదిక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసిన సానుకూల ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు ఇదే విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావులు ఏం చేస్తారన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.
జస్టిస్ పి.సి. ఘోష్ కమిటీలోని ముఖ్యమైన ఆరోపణలు ఇవే
జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ తన పని పూర్తి చేసి, 665 పేజీల నివేదికను జులై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు కారణం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, నిధులు మంజూరు చేసిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అని తప్పుబట్టింది. వీరితో పాటు కొందరు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లను బాధ్యులుగా పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వీరే కారకులని తేల్చి చెప్పింది.
1. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకు బాధ్యుడు కేసీఆరే: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆరే కారణమని జస్టిస్ పి.సి. ఘోష్ కమిటీ నివేదిక తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్ణయాధికారం మొత్తం కేసీఆర్ చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందన్న అంశాన్ని నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. ప్రాజెక్టు రీడిజైనింగ్, ముఖ్య నిర్ణయాలు, సవరణలు, కాంట్రాక్టుల మంజూరు వంటివి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగాయన్నది దీని సారాంశం.
2. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లేదు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు నాటి క్యాబినెట్ అనుమతి లేదని నివేదిక ఎత్తి చూపింది. నాటి సీఎం కేసీఆర్, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టులను ఆమోదించారని తప్పుబట్టింది.
3. నిపుణుల నివేదికలను పట్టించుకోలేదు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీటి పారుదల రంగంలోని నిపుణులు ఇచ్చిన నివేదికలను కేసీఆర్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని ఘోష్ కమిషన్ నివేదిక తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేంద్ర జల సంఘాన్ని తప్పుదోవ పట్టించారన్న అంశం నివేదికలో వెల్లడైంది. కొద్ది మంది ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సైతం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభిప్రాయాన్ని కమిషన్ వ్యక్తం చేసింది.
కాళేశ్వరం కమిషన్ నివేదిక తర్వాత బీఆర్ఎస్ ముందున్న సవాళ్లు ఇవే
జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టిందనడంలో సందేహం లేదు. అయితే, ఆ పార్టీ ఇప్పుడు న్యాయపరంగా, రాజకీయంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పార్టీ ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉందంటే...
1. న్యాయపోరాటానికి సిద్ధం కావడం: జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఏకంగా పార్టీ చీఫ్ కేసీఆర్ను, మరో ముఖ్య నేతగా ఉన్న హరీశ్ రావును తప్పుబట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం వీరిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఈ కేసులను, అరెస్టు వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వీటిపై న్యాయపోరాటం దిశగా గులాబీ బాస్ ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించారన్న వార్తలు పార్టీ వర్గాల నుండి వస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్, ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీశ్ రావులను కాపాడుకోవడం ఇప్పుడు ఆ పార్టీ ముందున్న అతి పెద్ద సవాలుగా చెప్పవచ్చు.
2. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పొందడం: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కలికితురాయిగా బీఆర్ఎస్ ప్రతి వేదిక మీద చెబుతూ వచ్చింది. ఇప్పుడు అదే ప్రాజెక్టు విషయంలో పలు తప్పులను ఎత్తి చూపుతూ జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని సాక్షాత్తు ప్రధాని మోదీ చేసిన ఆరోపణలకు ఈ నివేదిక బలం చేకూర్చింది. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ నివేదిక వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయంగా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం ఈ పార్టీ ముందున్న మరో ప్రధాన సవాల్గా చెప్పవచ్చు.
3. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడం: గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాల రచ్చతో ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితుల్లోనే పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక బయటకు రావడంతో పార్టీ నేతలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వంటి నేతలు పార్టీకి రాజీనామా చేయడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చకు దారి తీస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఎలా సన్నద్ధం అవుతుందన్న చర్చ గులాబీ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. ఈ పరిణామాలన్నింటికి గులాబీ చీఫ్ కేసీఆర్ ఎలా పరిష్కారం చూపుతారన్నది మరో సవాల్గా చెప్పవచ్చు.
బీఆర్ఎస్ ఎంచుకున్న వ్యూహం ఇదేనా?
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గత కొద్ది రోజులుగా కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి వంటి ముఖ్య నేతలు సమావేశమవుతూ వస్తున్నారు. నివేదిక తర్వాత పరిణామాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దాడికి బీఆర్ఎస్ ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
1. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజంటేషన్లు: మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ద్వారా మరోసారి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో ఇది భాగమని చెప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు విరివిగా ఇప్పించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సహా, ముఖ్య నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రజెంటేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.
2. రాజకీయ కుట్రగా మలుపు తిప్పడం: తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను అంతం చేసే కుట్రగా దీన్ని మలుపు తిప్పే వ్యూహం కూడా ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని, దాన్ని ఖతం చేస్తే నష్టపోయేది తెలంగాణ ప్రజలే అన్న సెంటిమెంట్ను రగిలించే వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేసినట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆలస్యం అవ్వడం, అది స్థానిక సంస్థల ఎన్నికల ముందే బయటపెట్టడం ఇవన్నీ కాంగ్రెస్-బీజేపీ సంయుక్త కుట్రగా ప్రజల్లో ప్రచారం చేసే వ్యూహంతో గులాబీ దళం సాగే అవకాశం ఉంది.
3. శాసన సభ - ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ను తిప్పికొట్టడం: శాసన సభలో దీనిపై చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడంతో గులాబీ పార్టీ ఈ దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము ఏం చేశాం, కాంగ్రెస్ కుట్ర ఏంటి అన్న విషయాలను ప్రధానంగా శాసన సభ చర్చ ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా మరో వ్యూహాన్ని గులాబీ చీఫ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అదే రీతిలో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఇదే విషయాలను తీసుకెళ్లేలా సభలు, సమావేశాలు, పార్టీ క్యాడర్కు శిక్షణ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ వ్యూహాలను తిప్పికొట్టాలని ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలకు గులాబీ బాస్ కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఏది ఏమైనా, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద రాజకీయ సంక్షోభం లేదా పరీక్షా సమయాలను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. ఈ కీలక పరిణామాలను దాటి, ఎలాంటి రాజకీయాలతో పార్టీని కేసీఆర్ ముందుకు నడుపుతారో వేచి చూడాల్సిందే.






















