Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Congress Candidates for Rajya Sabha Elections 2026 | రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీతో పాటు వేం నరేందర్ రెడ్డిలకు అవకాశం ఇచ్చింది.

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ఎంపిక ప్రతిపాదనలను ఆమోదించారు. పలు రాష్ట్రాల నుండి పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థుల వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 5 రాష్ట్రాల నుంచి ఆరుగురు అభ్యర్థులకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వగా.. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల పేర్లు ప్రకటించారు.
రాష్ట్రాల వారీగా అభ్యర్థులు
కాంగ్రెస్ తాజా ప్రకటన ప్రకారం 5 రాష్ట్రాల నుండి మొత్తం ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తే..
తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం నుండి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు.
ఛత్తీస్గఢ్: ఇక్కడి నుండి ఫూలో దేవి నేతమ్ పోటీ చేయనున్నారు.
హర్యానా: హర్యానా నుంచి కరమ్వీర్ సింగ్ బౌధ్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
హిమాచల్ ప్రదేశ్: కాంగ్రా డీసీసీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ ఇక్కడి నుండి బరిలో ఉన్నారు.
తమిళనాడు: తమిళనాడు నుండి ఎమ్. క్రిస్టోఫర్ తిలక్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు.
The Congress President Shri @kharge, has approved the proposal for the candidature of the following persons to contest the Rajya Sabha elections as Congress candidates from the states mentioned against their names: pic.twitter.com/5rjufZqpEX
— Congress (@INCIndia) March 5, 2026
పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది.
సింఘ్వీకి మరో ఛాన్స్: జాతీయ స్థాయిలో పార్టీకి ట్రబుల్ షూటర్గా, బలమైన గొంతుకగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ సేవలను గుర్తించి పార్టీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. గతంలో ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన ఆయన పదవీకాలం ముగియనుండటంతో, రాష్ట్ర నాయకత్వం కూడా సింఘ్వీ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. దాంతో కాంగ్రెస్ అధిష్టానం సింఘ్వీ పేరును గురువారం ప్రకటించింది.
వేం నరేందర్ రెడ్డికి లక్కీ ఛాన్స్: సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా, కష్టకాలంలో తోడున్న వ్యక్తిగా వేం నరేందర్ రెడ్డికి ఈ అవకాశం దక్కింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వీహెచ్, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి లాంటి కొందరు నేతలు రేసులో ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినా, ఆయన ఆసక్తి చూపకపోవడంతో వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు.
పార్టీ జాతీయ అవసరాలు, తెలంగాణ స్థానిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం 5 రాష్ట్రాల నుంచి ఆరుగురు అభ్యర్థుల జాబితా మార్చి 5న ఉదయం ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న మెజారిటీ దృష్ట్యా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. దీంతో పెద్దల సభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రాతినిధ్యం మరింత బలపడనుంది.
ట్రెండింగ్ వార్తలు





















