Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
CM Revanth: మార్చి 6 నుంచి 99 రోజుల పాటు యంత్రాంగం అంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం రేవంత్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికతో మొత్తం మార్చేయాలనుకుంటున్నారు.

Telangana Public Governance Progress Plan: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వేగం పెంచేందుకు, సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిట ఉంచేందుకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన 99 రోజుల కార్యాచరణను ప్రకటించింది. మార్చి 6, 2026 నుంచి ప్రారంభమై జూన్ 12 వరకు ఈ 99 రోజుల కాలాన్ని 10 ప్రధాన అంశాలుగా విభజించి, ఐదు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, రోడ్డు భద్రత , సంక్షేమం, యువత-క్రీడలు, డ్రగ్స్ రహిత సమాజం వంటి కీలక రంగాలు ఉన్నాయి. ప్రతి రంగానికి నిర్దిష్ట గడువును విధిస్తూ, పాలనలో జవాబుదారీతనాన్ని పెంచడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.
క్షేత్రస్థాయి పాలన - కలెక్టర్లకు టార్గెట్స్
ఈ కార్యక్రమం ద్వారా కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా, యంత్రాంగం మొత్తాన్ని క్షేత్రస్థాయికి నడిపించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామ సభల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలపై లబ్ధిదారుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరించాలని ఆదేశించారు. కలెక్టర్ల పనితీరుకు ఈ 99 రోజుల కార్యాచరణ ఒక బెంచ్మార్క్ గా నిలుస్తుందని సీఎం నమ్మకంతో ఉన్నారు.
టెక్నాలజీతో పారదర్శకత
సంక్షేమ పథకాల అమలులో అక్రమాలను అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను జోడిస్తోంది. లబ్ధిదారుల గుర్తింపు కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. అలాగే, సేవలను ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దకే చేరవేసేలా ఈ-గవర్నెన్స్ సంస్కరణలు చేపడుతున్నారు. పాత సర్వర్లను అప్డేట్ చేసి, రాబోయే 20 ఏళ్లకు సరిపడా డిజిటల్ డేటా వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం.
విద్య, వైద్య వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు
ప్రభుత్వ ఆసుపత్రులను సమీపంలోని మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు కూడా నిపుణులైన వైద్యుల సేవలు అందేలా చేయడం ఈ ప్రణాళికలో మరో ముఖ్య అంశం. విద్యా రంగంలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కూళ్లలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పెండింగ్ బిల్లులు లేకుండా చేయడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
వికసిత్ తెలంగాణ - విజన్ 2047
సీఎం రేవంత్ రెడ్డి ఈ 99 రోజుల కార్యాచరణను కేవలం స్వల్పకాలిక పథకంగా కాకుండా, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దిశగా ఒక మైలురాయిగా చూస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పాలనలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి, తెలంగాణను దేశానికే ఒక మోడల్గా నిలపాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం. పరిశ్రమల స్థాపనలో, సేవారంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన ఉంచడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన ఆర్థిక పునాది వేయాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ 99 రోజుల ప్రణాళిక రేవంత్ రెడ్డి రాజకీయ పరిపక్వతకు, పాలనా దక్షతకు ఒక పరీక్షగా నిలవనుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు సేవలను వేగంగా చేరవేయడంలో ఈ కార్యక్రమం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.























