Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడే అరుదైన క్షణాలకు రెండు అడుగుల దూరంలో నిలబడింది భారత్. సూపర్ 8 దశలో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభావంతో తబ్బిబ్బైన భారత్..వెస్టిండీస్ పై స్ఫూర్తిదాయక విజయంతో ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. అభిషేక్ శర్మ మినహాయించి మిగిలిన బ్యాటర్లంతా దాదాపుగా టచ్ లో కనిపిస్తుండంటతో ఇవాళ ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో పరుగుల వరద మరోసారి ఖాయం అని టీమిండియా భావిస్తోంది. ప్రత్యేకించి పులి అభిషేక్ శర్మ ఈ రెండు నాకౌట్ మ్యాచుల్లో సత్తా చాటితే చాలు కప్పు మన చేతుల్లోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ తమ స్థాయి ఇన్నింగ్సులను బాకీ ఉన్నారు. సంజూ శాంసన్ వెస్టిండీస్ పై తన పోరాటం మళ్లీ గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన పని ఉంది. ఇక పాండ్యా, దూబే తమదైన రోజున ఎంతటి యోధులైనా చిత్తు చేయగల తెగింపు ఉన్న ఆటగాళ్లు. బౌలింగ్ లో బుమ్రా కొండంత అండలా నిలుస్తున్నాడు. అర్ష్ దీప్ వైడ్ యార్కర్స్ తో, పాండ్యా స్లోవర్ బాల్స్ తో ఆకట్టుకుంటున్నా..స్పిన్ విభాగం డల్ గా మారింది మనకు. వరుణ్ చక్రవర్తి తన మాయాజాలాన్ని ఇంగ్లండ్ పై బయటకు తీయాల్సి ఉంది. మరో వైపు ఇంగ్లండ్ ను తక్కువ అంచనా వేయలేం. లీగ్ దశలో నేపాల్ లాంటి జట్ల చేతిలో తడబడినా ఇంగ్లండ్ ఎప్పుడూ ఛాంపియన్ తరహా ఆటతీరు ప్రదర్శించే జట్టే. పైగా విల్ జాక్స్ నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెప్టెన్ బ్రూక్ యువ నాయకత్వం ఓవైపు... ముంబై వాంఖడే పరిస్థితులు ఐపీఎల్ కారణంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు అలవాటే కావటం మరోవైపు టీమిండియా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. రికార్డులను రివార్డులను పక్కన పెట్టి టీమిండియా తన బలాన్ని పూర్తి స్థాయిలో ఇంగ్లండ్ పై ప్రదర్శించాలని సగర్వంగా కివీస్ తో ఫైనల్ పోరాటానికి వెళ్లాలని ప్రతీ భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు























