Telangana Municipal Elections Results 2026: కొత్తగూడెం మేయర్ పీఠంపై కేటీఆర్ కొత్త పాచిక - కాంగ్రెస్, సీపీఐ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమేనా?
BRS supports CPI: ఒకప్పుడు కమ్యూనిస్టుల్ని తోకపార్టీలుగా చెప్పిన బీఆర్ఎస్ పెద్దలు ఇవాళ అడగకపోయినా సీపీఐకి మద్దతు ప్రకటించారు. కానీ సీపీఐ ఆ మద్దతు అంగీకరిస్తుందా అన్నదే ఇప్పుడు కీలకం.

BRS supports CPI even though it was not asked in Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో తెలంగాణ రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి దక్కకుండా చేసేందుకు, తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్ల మద్దతును సీపీఐకి ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ ప్రకటన చేసే ముందు ఆయన కనీసం తమ పార్టీ కార్పొరేటర్లతో గానీ, ఖమ్మం జిల్లా కీలక నేతలతో గానీ సంప్రదించకుండానే నేరుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి చెప్పారు.. తర్వాత ప్రెస్మీట్ లో ప్రకటించారు.
పొత్తుల బంధం - జాతీయ సమీకరణాలు
కేటీఆర్ మద్దతు ప్రతిపాదనను సీపీఐ స్వీకరిస్తుందా అంటే అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సీపీఐ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ధృడమైన పొత్తులో ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుండి కాంగ్రెస్ మద్దతుతోనే విజయం సాధించారు. స్థానిక ఎన్నికల్లో కేవలం సీట్ల సర్దుబాటు కుదరక విడివిడిగా పోటీ చేసినంత మాత్రాన, మేయర్ పదవి కోసం కాంగ్రెస్తో బంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్తో చేతులు కలిపే అవకాశాలు ఉండవు.
కూనంనేని పరోక్ష సంకేతాలు
కేటీఆర్ ఫోన్ కాల్పై స్పందించిన కూనంనేని.. తమ నిర్ణయం వ్యక్తిగతం కాదని, జాతీయ నాయకత్వ నిర్ణయం మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే.. ఒక మేయర్ పదవి కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో ఉన్న సంబంధాలను సీపీఐ పణంగా పెట్టదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్తో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకుని స్థానిక పాలనను సాఫీగా సాగించడానికే ఆ పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉంది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీపీఐ మద్దతు కోసం బీఆర్ఎస్ చాలా హామీలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తులు కొనసాగిద్దామని కేసీఆర్ చెప్పారు. అయితే మునుగోడు విజయం తర్వాత కనీసం ప్రగతి భవన్ గేట్లు కూడా తెరవకుండా కమ్యూనిస్ట్ నేతలను బీఆర్ఎస్ విస్మరించిందనే అసంతృప్తి వారిలో బలంగా ఉంది. ఆ చేదు అనుభవాల తర్వాతే సీపీఐ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు.
కేటీఆర్ వ్యూహం వెనుక అసలు లక్ష్యం
నిజానికి కొత్తగూడెంలో సీపీఐకి మేయర్ పదవి కట్టబెట్టాలనే ప్రేమ కంటే, కాంగ్రెస్-సీపీఐ మధ్య చిచ్చు పెట్టి ఆ కూటమిని బలహీనపరచడమే కేటీఆర్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సీపీఐ గనుక ఈ ఆఫర్కు మొగ్గు చూపితే, కాంగ్రెస్ నుండి వారిని శాశ్వతంగా దూరం చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. కానీ, రాజకీయ పరిణతి కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలు కేటీఆర్ వేసిన ఈ బంతి 'ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ మరియు సీపీఐలు కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని భావించవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

















