Telangana Municipal Elections Results 2026: కార్పొరేషన్లలో కారుకు పంక్చర్ - ఏడు చోట్లా కనీస పోటీ కరవు
BRS: ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు చోట్ల కాంగ్రెస్ ..ఓ చోట సీపీఐ, మరో రెండు చోట్ల బీజేపీ మేయర్ పీఠాలను పొందే అవకాశం ఉంది.

Telangana Municipal Elections Corporation Results: 2026 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్లా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గులాబీ పార్టీ కనీసం ఉనికిని కూడా చాటుకోలేక, అన్ని చోట్లా మూడో స్థానానికి పరిమితమైంది. పట్టణ ఓటర్లు ఈసారి బీఆర్ఎస్ అగ్రనేతల కంచుకోటలను సైతం బద్దలు కొడుతూ అధికార కాంగ్రెస్ , బీజేపీల వైపు స్పష్టంగా మొగ్గు చూపారు. ఈ ఫలితాలు పార్టీ నాయకత్వానికి శరాఘాతంగా మారాయి.
నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. రామగుండంలో సింగిల్ డిజిట్
మున్సిపల్ కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండ లో కాంగ్రెస్ తన విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయారు. అటు రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా, బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమైంది. ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతూ అధికార పార్టీకి భారీ మెజారిటీని కట్టబెట్టారు.
కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ దూకుడు
కరీంనగర్ కార్పొరేషన్ లో కూడా బీఆర్ఎస్కు పరాభవం తప్పలేదు. కరీంనగర్, నిజామాబాద్లలో బీజేపీ మేయర్ పీఠాల దిశగా దూసుకుపోతుండగా, కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చింది. కానీ, ఒకప్పుడు ఈ రెండు కార్పొరేషన్లను శాసించిన బీఆర్ఎస్ మాత్రం కేవలం నామమాత్రపు సీట్లకే పరిమితమైంది. ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు సాగింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ పార్టీలు సమాన స్థానాల్లో నిలిచాయి. అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి అన్కండిషనల్ ఆఫర్ ఇచ్చింది. అయితే రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉన్నందున సీపీఐ మాత్రం కాంగ్రెస్తో కలిసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మహబూబ్నగర్, మంచీర్యాల కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
స్వతంత్రుల కంటే వెనుకబడ్డ బీఆర్ఎస్
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పలు కార్పొరేషన్ డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థుల ఓట్ల కంటే బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయి. ఇది పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతగా బలహీనపడిందో తెలియజేస్తోంది. కేవలం సిరిసిల్ల, సిద్దిపేట వంటి కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితం కాగా, కార్పొరేషన్ల స్థాయిలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మొత్తం ఏడు కార్పొరేషన్లలో నల్గొండ, మహబూబ్నగర్, మంచీర్యాల, రామగుండం కాంగ్రెస్ వశం కాగా.. నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ మేయర్లు కొలువుదీరే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్-సీపీఐ కూటమి అధికారంలోకి రానుంది. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభ తగ్గుతోందనడానికి సంకేతమని భావిస్తున్నారు.























