International Yoga Day: ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
Yoga day: ఇంటర్నేషనల్ యోగాడే ను ఏపీ సీఎం టూరిజం ప్రమోట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రోటోకాల్ ప్రకారమే నిర్వహిస్తున్నారు.

Revanth Reddy vs Chandrababu on Yoga day: రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ, పరిపాలనా వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దీనిని ఒక ప్రతిష్టాత్మక బ్రాండ్గా మార్చేందుకు యోగాంధ్ర పేరిట సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరై యోగా దినోత్సవాన్ని ఏ స్థాయిలో విజయవంతం చేశారో, అదే పరంపరను అంతకు మించి వినూత్నంగా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి భిన్నంగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేడుకల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యోగాంధ్రతో ఏపీ సరికొత్త బ్రాండింగ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ, గ్లోబల్ విజన్తో పాటు సంస్కృతి, జీవన విధానాన్ని కూడా రాష్ట్ర బ్రాండింగ్కు వాడుకోవడంలో దిట్ట. అందులో భాగమే ఈ యోగాంధ్ర కాన్సెప్ట్. గత ఏడాది విశాఖ ఆర్కే బీచ్ తీరంలో ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన వేడుకలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ ఏడాది చంద్రబాబు కేవలం ఒకే నగరానికి పరిమితం కాకుండా.. అమరావతి, తిరుపతి, విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని ఐకానిక్ పర్యాటక ప్రాంతాలైన అరకు లోయ, గండికోట వంటి చోట్ల విభిన్నంగా యోగా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు. ఐటీ కారిడార్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా యువతలో హెల్త్-కాన్షియస్ బ్రాండ్గా ఏపీని నిలబెట్టాలనేది ప్రభుత్వ వ్యూహం.
కేంద్రంతో సత్సంబంధాలు - సంయుక్త నిర్వహణ
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖతో సంయుక్తంగా ఈ వేడుకలను అత్యంత భారీ వ్యూహంతో నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలను ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. యోగా ద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయవచ్చని, విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, ప్రభుత్వ యంత్రాంగం అంతా యోగాంధ్ర ను ఒక పండుగలా మార్చేందుకు నెల రోజుల ముందే కార్యాచరణ సిద్ధం చేసింది.
తెలంగాణలో ప్రోటోకాల్ కే పరిమితం!
దీనికి పూర్తి భిన్నంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోగా దినోత్సవ నిర్వహణను ఒక ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించడం లేదనే సంకేతాలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లేదా ఒక నిర్దిష్ట ఐడియాలజీ సంబంధించిన కార్యక్రమంగానే చూస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. అధికారిక ప్రోటోకాల్ కార్యక్రమాలకు మించి, ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎలాంటి ప్రత్యేక నిధులు గానీ, పెద్ద ఎత్తున ఈవెంట్లు గానీ తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వెనుక స్పష్టమైన రాజకీయ కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోగాను ప్రపంచవ్యాప్తంగా ఒక మైలురాయిగా ప్రమోట్ చేస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం.. బీజేపీ మార్క్ ఉన్న కార్యక్రమాలకు మైలేజ్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. పైగా, రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో యోగా దినోత్సవాన్ని ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తే, అది పరోక్షంగా బీజేపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుందనే వ్యూహాత్మక వెనుకడుగు ఇక్కడ కనిపిస్తోంది.
యోగా రాజకీయాలకు అతీతం
రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, యోగా అనేది ఒక పబ్లిక్ హెల్త్ అంశమని, దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు యోగాను ఒక సాఫ్ట్ పవర్ గా పర్యాటకానికి ఒక సాధనంగా మలచుకుంటుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటోందని అంటున్నారు. ఐటీ హబ్ అయిన హైదరాబాద్లో నివసించే లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువత ఒత్తిడితో సతమతమవుతున్న తరుణంలో, ప్రభుత్వం చొరవ తీసుకుని హెల్త్ డ్రైవ్స్ నిర్వహిస్తే మంచి పేరు వస్తుందని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















