YS Sharmila: 'చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు' - విజన్ 2047పై షర్మిల సెటైర్లు
Andhra Politics: రాష్ట్ర దిశ, దశ మారాలంటే కావాల్సింది విజన్లు కాదని.. విభజన హామీలను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు.
![YS Sharmila: 'చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు' - విజన్ 2047పై షర్మిల సెటైర్లు ap pcc chief ys sharmila satires on cm chandrababu vision 2047 YS Sharmila: 'చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు' - విజన్ 2047పై షర్మిల సెటైర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/14/b37e361377b66e2cdf93517d0bf0b3571734156350410876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sharmila Satires On Chandrababu Vision 2047: విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలని అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని స్పష్టం చేశారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేసి.. పూర్తిగా అటకెక్కించారని మండిపడ్డారు. 'రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించింది. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13లో పొందు పరించింది. కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో చెప్పింది. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయి.' అని పేర్కొన్నారు.
విజన్ 2047 పేరుతో చంద్రబాబు @ncbn గారు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు.…
— YS Sharmila (@realyssharmila) December 14, 2024
'ఒక్క హామీకి..'
విభజన జరిగి నేటికీ ఒక్క హామీకి దిక్కులేకుండా పోయిందని షర్మిల విమర్శించారు. 'గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవి. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవి. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవి. పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవి. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది ఉంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేది. విభజన హామీలు అమలై ఉంటే రాష్ట్రం దిశ - దశ పూర్తిగా మారేది. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేది. విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని మోదీ అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్మోహన్రెడ్డి.. ముగ్గురూ కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. హోదా 5 ఏళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మోదీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు గారు చెవుల్లో పూలు పెట్టారు. హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోదీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి.' అని హితవు పలికారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)