Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ( T20 World Cup final ) ముగిసిన తర్వాత ప్లేయర్స్ అందరూ ఫ్లైట్స్ బుక్ చేసుకొని తమ సొంతూర్లకు ప్రయాణం అయ్యారు. స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించిన శివమ్ దూబే మాత్రం ముఖం దాచుకుని రైలులో ప్రయాణించి తన ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ప్రపంచకప్ విజయం తర్వాత అహ్మదాబాద్ నుండి ముంబైకి వెళ్లే అన్ని ఫ్లైట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. తన భార్య, స్నేహితుడితో కలిసి వెంటనే ముంబై చేరుకోవాల్సిన దూబేకు వేరే దారి లేక ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. ఉదయం 5:10 గంటలకు అహ్మదాబాద్ లో సయాజీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. ఒక స్టార్ క్రికెటర్ ట్రైన్ ఎక్కుతే జనం ఊరుకోరు కదా. అందుకే దూబే తలకు క్యాప్, ముఖానికి మాస్క్, ఫుల్ స్లీవ్ టీ-షర్ట్ వేసుకొని ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు.
థర్డ్ ఏసీ బోగీలోకి ఎక్కి నేరుగా అప్పర్ బెర్త్ ఎక్కేసి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. మధ్యలో టికెట్ చెక్ చేయడానికి వచ్చిన టీటీఈ.. పేరు చూసి ఆశ్చర్యపోయి "శివం దూబే అంటే ఆ క్రికెటరా?" అని అడిగాడు అట. వెంటనే దూబే భార్య "కాదు కాదు.. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు?" అని చెప్పిందట.
ముంబై స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి పోలీసుల సహాయం కోరాడు. ట్రైన్ లో శివం దూబే వస్తున్నాడని తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. చివరకు పోలీసు బందోబస్తుతో సురక్షితంగా తన ఇంటికి చేరుకున్నారు.























