AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Chandrababu: ఏపీఐఐసీ కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A నుండి తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

Key decisions taken in Andhra Pradesh cabinet meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతి సచివాలయంలో జరిగిన 45వ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి , పరిపాలనా సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా పరిశ్రమల స్థాపనకు ఉన్న అడ్డంకులను తొలగించడం, రాజధాని అమరావతి పనులకు నిధుల విడుదల, పోలీసు వ్యవస్థలో పదోన్నతుల వంటి అంశాలకు ప్రాధాన్యత లభించింది.
పరిశ్రమలకు భూ చిక్కుల నుంచి విముక్తి
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏపీఐఐసీ కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A నుండి తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు మార్గం సుగమమైంది. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద రూ. 300 కోట్ల నిధులతో 3,500 మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు, తద్వారా 17,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అమరావతి నిర్మాణానికి భారీ నిధులు
రాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సచివాలయం ,శాఖాధిపతుల కార్యాలయాల టవర్లలో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ వంటి అంతర్గత పనుల కోసం రూ. 2,316.88 కోట్లను మంజూరు చేశారు. దీనితో పాటు, నీరుకొండలో రూ. 119 కోట్లతో అత్యాధునిక తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి పరిపాలన ఆమోదం లభించింది. ఇందులో 2,000 మంది కూర్చునే భారీ ఆడిటోరియం, తెలుగు భాషా మ్యూజియం ఏర్పాటు కానున్నాయి.
పోలీసు వ్యవస్థ బలోపేతం
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏపీ ఎస్పీ బెటాలియన్లలో పనిచేస్తున్న 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ. 9,355 కోట్లతో 7 భారీ మల్టీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 76 మండలాల్లోని 65 లక్షల మందికి సురక్షితమైన తాగునీరు అందనుంది. అలాగే, గిరిజన ప్రాంతాల్లో సాగునీటి కోసం డ్రిప్ ఇరిగేషన్పై 100% సబ్సిడీ ఇచ్చేలా నిబంధనలు సవరించారు.
విద్య , వైద్య రంగాలకు భూ కేటాయింపులు
రాష్ట్రవ్యాప్తంగా విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నందిగామ , నూజివీడు , పలాస ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాల స్థాపన కోసం సుమారు 17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించారు. అలాగే నెల్లూరులో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి, ముత్తకూరులో సీఎస్ఆర్ హాస్పిటల్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు జంట సొరంగాల విస్తరణ పనుల కోసం అదనంగా రూ. 48 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
సామాజిక , పర్యావరణ స్పృహ
మహిళా భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 కొత్త వర్కింగ్ విమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఉద్యోగాలకు వెళ్లే తల్లుల కోసం పిల్లల్ని చూసుకునే క్రెష్ సదుపాయం కూడా ఉంటుంది. పర్యావరణ పరంగా, కేంద్ర ప్రభుత్వ నీటి కాలుష్య నివారణ సవరణ చట్టం-2024ను రాష్ట్రంలో అమలు చేసేందుకు తీర్మానం చేశారు. దీనివల్ల చిన్నచిన్న ఉల్లంఘనలకు జైలు శిక్షల బదులు జరిమానాలు మాత్రమే విధించే అవకాశం ఉంటుంది, తద్వారా పారిశ్రామికవేత్తలకు వేధింపులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















