Andhra Pradesh Local Polls: లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
Local Polls Alliance: ఏపీలో స్థానిక ఎన్నికలు కూటమి పార్టీలకు ఓ పెద్ద సవాల్ గా మారనున్నాయి. గెలవడం కాదు.. తమ మధ్య పోటీకి సీట్లు పంచుకోవడమే పెద్ద సమస్యగా మారనుంది.

Big challenge for Alliance in Local Polls : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఈసారి పోరు అధికార, ప్రతిపక్షాల మధ్య కంటే.. అధికార కూటమిలోని పార్టీల మధ్యే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ, ఈ ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తుండటంతో, ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపైనే పడింది. పైన నేతలు చేతులు కలిపినా, కింద కేడర్ మనసులు కలవడమే ఇప్పుడు అసలైన సవాల్గా మారింది.
జనసేన దూకుడు.. కోనసీమ ప్రకటనలతో గుబులు!
కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఈ సారి స్థానిక సంస్థల్లో సింహభాగం ఆశిస్తోంది. ఇటీవల రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వంటి నేతలు కోనసీమ లాంటి ప్రాంతాల్లో 80 శాతం స్థానాల్లో తామే పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటించడం కూటమిలో కలకలం రేపుతోంది. జనసేన బలంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ కేడర్ సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మిత్రపక్షాల మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరుతో అంతర్గత పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీ కేడర్ అసంతృప్తిని ఎలా సర్దుబాటు చేస్తారు?
దశాబ్దాలుగా గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీకి, స్థానిక ఎన్నికలు చావో రేవో లాంటివి. తమ గ్రామంలో పట్టు కోల్పోవడానికి ఏ నాయకుడూ ఇష్టపడడు. సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు పట్టున్న గ్రామాలను మిత్రపక్షాలకు కేటాయిస్తే, టీడీపీ కేడర్ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పైస్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సఖ్యత క్షేత్రస్థాయిలో ఓటర్ల బదిలీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది అసలు ప్రశ్న.
వైసీపీ బహిష్కరణ వ్యూహం.. కూటమికి లాభమా? నష్టమా?
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం కంటే బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకతను ప్రదర్శించాలని భావిస్తోంది. ఒకవేళ వైసీపీ బరిలో లేకపోతే, కూటమిలోని పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడటం ఖాయం. ప్రత్యర్థి లేని పోరాటంలో మిత్రపక్షాల మధ్య వైషమ్యాలు పెరిగి, అది ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చిక్కుముడి వీడేది ఎలా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేల స్థాయిలో కాకుండా, గ్రామ స్థాయిలో కమిటీలు వేసి సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎక్కడ ఎవరు బలంగా ఉన్నారో వారికే కేటాయించడం. నియోజకవర్గ స్థాయిలోనే మూడు పార్టీల నేతలతో కమిటీలు వేసి వివాదాలు పరిష్కరించడం. స్థానిక సమస్యలపై కూటమి తరపున ఒకే అజెండాతో ప్రజల్లోకి వెళ్లడం వంటివి చేయాల్సి ఉంది. కూటమి నాయకత్వం ఈ చిక్కుముళ్లను విడదీయకపోతే, స్థానిక ఎన్నికలు మిత్రపక్షాల మధ్య విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉంది. అధికారాన్ని పంచుకోవడంలో చూపిన పరిణతిని, క్షేత్రస్థాయిలో సీట్ల పంపకంలో కూడా చూపిస్తేనే కూటమి ప్రయోగం విజయవంతమవుతుంది. లేనిపక్షంలో, ప్రత్యర్థి లేకపోయినా సొంత పార్టీల కుమ్ములాటలే కూటమికి అతిపెద్ద శత్రువులుగా మారతాయి.























