TDP Communal Politics: రూటు మార్చిన చంద్రబాబు, పవన్ - మత రాజకీయాలకే ప్రాధాన్యం - జగన్ను ఎదుర్కోవడానికి తప్పడం లేదా?
Chandrababu religious politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మతపరమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. కూటమి రాజకీయాలకు ఇవే అస్త్రంగా మారుతున్నాయి.

Is Chandrababu giving priority to religious politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మతపరమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం చుట్టూ తిరిగే రాజకీయాలు ఇప్పుడు విశ్వాసాలు, సంప్రదాయాల వైపు వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గతంలో వీరి పాలసీ ఇలా ుండేది కాదు.
రాజకీయ పంథా మార్చిన కూటమి నేతలు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్ని వర్గాలను సమదృష్టితో చూసే లౌకిక విధానాన్నే అనుసరించింది. గతంలో బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు మతపరమైన వివాదాలకు దూరంగా ఉండేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ వివాదం, ఆలయాల నిర్వహణ వంటి అంశాల్లో ఆయన తీసుకుంటున్న స్టాండ్ కమ్యూనల్ పాలిటిక్స్ కు దారితీస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ సైతం సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో చేస్తున్న వ్యాఖ్యానాలు ఈ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మెజారిటీ వర్గమైన హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడమే లక్ష్యంగా వీరు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
హిందూ ధర్మం కోసమేనంటున్న నేతలు
తమపై వస్తున్న మత రాజకీయాల విమర్శలను కూటమి నేతలు ఖండిస్తున్నారు. తాము ఏ మతానికి లేదా వర్గానికి వ్యతిరేకం కాదని, కేవలం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే వ్యక్తులను, వ్యవస్థలను మాత్రమే ప్రశ్నిస్తున్నామని వారు వాదిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల పై జరిగిన దాడులు, అపచారాల విషయంలో జగన్మోహన్ రెడ్డి మౌనం వహించడమే తమ ఆగ్రహానికి కారణమని వారు చెబుతున్నారు. భక్తి భావం ఉన్న ఏ వ్యక్తికైనా తమ మతాచారాలు కలుషితం అవుతుంటే స్పందించే హక్కు ఉంటుందని, దీనిని రాజకీయంగా చూడటం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.
జగన్ కు మరింత బలంగా క్రైస్తవ ఓటు బ్యాంకు
ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సామాజిక వర్గం మొదటి నుండి వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత విశ్వాసాల కారణంగా ఆ వర్గంలో బలమైన పట్టు సాధించారు. ప్రస్తుతం కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలు జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా ఉండటంతో, అది తమ మతంపై దాడిగా క్రైస్తవ వర్గాలు భావించే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు ఏ మతాన్నీ విమర్శించకపోయినా, ఆయన వేస్తున్న నిందలు జగన్ క్రైస్తవ మూలాలను తట్టిలేపేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ఆ ఓటు బ్యాంకు మరింత గట్టిగా జగన్ వైపునకు మళ్లే అవకాశం ఉంది. క్రైస్తవ ఓటు బ్యాంకును పూర్తిగా జగన్ కు వదిలేయడం చంద్రబాబుకు ఇష్టం లేదు. గతంలో ఆయన హయాంలో కూడా క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. కానీ ఇప్పుడు హిందూత్వ ఎజెండాను బలంగా వినిపించడం వల్ల ఆ వర్గంలో అభద్రతా భావం ఏర్పడే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి కూటమి నేతలు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. జ
ఇక ఏపీలో మత రాజకీయాలే ఎక్కువ?
జ గన్ ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మతపరమైన కోణంలో చూపిస్తే, అది ఇతర మైనార్టీ వర్గాలను కూడా దూరం చేసే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తాము చేస్తున్న పోరాటం కేవలం ధర్మ పరిరక్షణ కోసమే తప్ప మరే ఇతర మతాన్ని కించపరచడానికి కాదని వారు పదేపదే చెబుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న క్రైస్తవ, మైనార్టీ వర్గాలు చంద్రబాబు మాటలకు ప్రభావితం అవుతారా లేదా జగన్ వైపే నిలబడతారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు చూస్తే.. ఏపీ రాజకీయాల్లో కొత్త దారిలో అదే మత దారిలో వెళ్తున్నాయని క్లారిటీ వస్తుంది.



















