PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
PM Narendra Modi On CJP Protest | జంతర్ మంతర్ నిరసనలో తనపై, తన తల్లిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యువతను క్షమించి, శిక్షించే బదులు సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో తనపై అనుచిత భాషను వాడారన్న వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అర్ధరాత్రి స్పందించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పిల్లలను తాను క్షమించాలని అనుకుంటున్నానని, సమాజం కూడా వారిని శిక్షించే బదులు సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ సంఘటన గురించి ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అందులో ఆయన ఈ ఘటన గురించి మాట్లాడుతూ, దయ, ఐక్యత కోసం పిలుపునిచ్చారు.
'నన్ను, నా దివంగత తల్లిని దూషించారు'
సీజేపీ ఆందోళనను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా, ప్రపంచమంతా చూసిందని అన్నారు.
"హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో మాట్లాడాలనిపిస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో దేశమంతా, ప్రపంచమంతా చూసింది. కొందరు అల్లరి పిల్లలు అత్యంత అసభ్యకరమైన భాషను వాడారు. ఏ నాగరిక సమాజంలోనూ స్థానం లేని పదాలను వాడారు. వారు నాతో పాటు చివరికి చనిపోయిన నా తల్లిని కూడా దూషించారు. అదంతా ఎంత అనాగరిమో మాటల్లో నేను చెప్పలేను" అన్నారు.
Abuses never solve anything.
— Narendra Modi (@narendramodi) July 31, 2026
Let’s guide the misguided.
Let’s work together.
Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL
పిల్లలు తప్పులు చేస్తే, వారికి మార్గదర్శనం వహించాలి
బాల్యం అనేది తప్పులు జరిగే సమయం, వాటి నుంచి నేర్చుకునే టైమ్ అని ప్రధాని అన్నారు. ఈరోజు, నేను వేరే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ఘటనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ‘సమాజంలో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. మన బిడ్డలు అలాంటి భాషను ఉపయోగించడం కల్చరల్ షాక్’ అన్నారు.
శిక్షించడం వల్ల పరిస్థితిలో మార్పు రాదు..
తప్పు చేసిన విద్యార్థులకు శిక్షలు విధించే బదులు వారికి సరైన మార్గాన్ని చూపించాలని పిలుపునిచ్చారు. ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని, వారికి సరైన మార్గాన్ని చూపించాల్సిన సమయం ఇది. దారితప్పిన వారికి సరైన దారి చూపించడం పెద్దలుగా మన బాధ్యత. వారిని శిక్షించడం, ఒక కోర్టు నుండి మరో కోర్టుకు తిప్పడం లేదా సమాజంలో వారిని వేధింపులకు గురిచేయడం వల్ల పరిస్థితిలో మార్పు రాదన్నారు.
Also Read: PM Modi Video: "భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో! https://telugu.abplive.com/news/todays-top-10-news-headlines-today-abp-desam-morning-headlines-31-july-2026-top-news-headlines-updates-telugu-news-254978
వారిని క్షమిస్తున్నాను..
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న విద్యార్థులను క్షమించాలనుకుంటున్నానని, తన అభిప్రాయాన్ని సమాజం అంగీకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. అందరూ నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. కొన్నిసార్లు మన పళ్ల కింద మన నాలుకే పడి రక్తం వస్తుంది. అంతమాత్రాన పళ్లను ఊడగొట్టుకోము కదా! ఎందుకంటే పళ్లు, నాలుక రెండూ మనవే. ఈ పిల్లలు కూడా మనవారే. దారితప్పిన వారికి మార్గదర్శకత్వం చేయడం లాంటి కష్టమైన పని స్వీకరించాలి’ అన్నారు.
దేశం కోసం కలిసి పనిచేద్దాం
తమ తప్పుల నుండి నేర్చుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులను కోరారు. దేశం కోసం కలిసి ముందుకు సాగుదాం, కొత్తది ఏదైనా నేర్చుకుందాం, మన తప్పుల నుండి కూడా పాఠాలు నేర్చుకుందామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశం వేగంగా పురోగమిస్తోంది, మీరందరూ కూడా సక్సెస్ కావాలన్నదే తన కలగా పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేద్దాం. మీ తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగాలని తన సందేశాన్ని ముగించారు.
ట్రెండింగ్ వార్తలు






















