Jubilee Hills Murder Case: జూబ్లీహిల్స్లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
IPS officer wife murder: మాజీ డీజీపీ వినయ్ రంజన్ సతీమణి తనూజ ను ఆమె ఇంట్లోనే పనిమనుషులు దారుణంగా హత్య చేశారు. పని మనిషి సాయంతో నేపాలీ గ్యాంగ్ ఈ పని చేసినట్లుగా గుర్తించారు.

Retired IPS officer wife brutally murdered: హైదరాబాద్లోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యోదంతం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మాజీ డీజీపీ వినయ్ రంజన్ సతీమణి తనూజ ను ఆమె ఇంట్లోనే పనిమనుషులు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
ప్రశాసన్ నగర్లో అర్థరాత్రి దారుణం
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లో ఉన్న ప్రశాసన్ నగర్లో గురువారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. విశ్రాంత డీజీపీ వినయ్ రంజన్ సతీమణి తనూజను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన సమయంలో వినయ్ రంజన్ ఇంట్లో లేకపోవడం, ఆయన పిల్లలు మేడపై నిద్రిస్తుండటాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నిందితులు ఇంటి బ్యాక్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి, హత్య చేసిన తర్వాత అదే మార్గంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి..
దుండగులు అత్యంత క్రూరంగా తనూజను అంతమొందించారు. ఆమెను ఎదిరించకుండా ఉండేందుకు తొలుత చేతులు కట్టేసి, కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తనూజ గత కొంతకాలంగా తన తల్లి అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఆమె తల్లి ఇటీవల మరణించినప్పటికీ, పనుల నిమిత్తం తనూజ ఇక్కడే బస చేశారు. ఈ లోపు ఈ ఘటన చోటుచేసుకోవడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
నేపాలీ గ్యాంగ్ పనే.. పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
ఈ కేసును విచారిస్తున్న పోలీసులు, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన నేపాలీ గ్యాంగ్ చర్యగా అనుమానిస్తున్నారు. ఇంట్లో పని మనిషిగా ఉన్న కల్పన అనే మహిళ, బయటి వ్యక్తులతో చేతులు కలిపి ఈ నేరానికి పాల్పడినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. నిందితులు నేపాల్కు చెందిన వారని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాం. ఇంట్లో పని చేసే కల్పనతో పాటు ఆమెకు సహకరించిన మరికొందరు వ్యక్తుల కోసం గాలిస్తున్నాం. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన క్లూస్ లభించాయి అని ఆయన తెలిపారు.
పనిమనుషుల పట్ల అప్రమత్తత అవసరం
నేపాలీ పనిమనుషుల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నేపాలీ పనిమనుషులు ఇంట్లో ఏడాది, రెండేళ్లు పని చేసినా సరే.. వారిపై నిఘా ఉంచాలి. యజమానులు ఇంట్లో లేని సమయం కోసం వారు వేచి చూస్తుంటారు. ముఖ్యంగా వారు ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటారు అని ఆయన పేర్కొన్నారు. పనిమనుషులను నియమించుకునేటప్పుడు వారి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం తప్పనిసరి అని సూచించారు.
అదృశ్యమైన నగదు, బంగారం?
ఈ దోపిడీ హత్యలో ఎంత మేర ఆస్తి దోపిడీ జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంట్లోని బీరువాలు తెరిచి ఉండటంతో, భారీగానే బంగారం , నగదు పోయి ఉంటుందని భావిస్తున్నారు. క్లూస్ టీమ్ , డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించాయి. నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.
హైప్రొఫైల్ వ్యక్తులు నివసించే ప్రశాసన్ నగర్లో, అది కూడా ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో ఇలాంటి ఘటన జరగడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు ఎవరూ భయాందోళన చెందవద్దని, నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని సీపీ భరోసా ఇచ్చారు. ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్నామని, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలు మరియు కాలనీల్లో పనిమనుషుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసే ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.
Before You Go
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
ట్రెండింగ్ వార్తలు





















