Malkajgiri Police Commissioner Sumati: డ్రగ్స్ కట్టడికి మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రత్యేక వ్యూహం - హాస్టల్స్ పై ఇక 24 గంటలూ నిఘా
IPS Sumati: యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు మల్కాజిగిరి పోలీసులు అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు. హాస్టల్స్ పై నిఘా పెంచారు.

Commissioner Sumati IPS: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు మల్కాజిగిరి పోలీసు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎక్కువగా ఉండే దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక నిఘా పెంచుతూ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాల పహారా నుంచి ఆన్-ది-స్పాట్ డ్రగ్ టెస్టుల వరకు పోలీసులు అమలు చేయబోతున్న ఈ టెక్నాలజీ వార్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
డ్రోన్ నిఘా.. స్పాట్ డ్రగ్ టెస్టులు
నగరంలో యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు. అర్థరాత్రి వేళల్లో విద్యార్థుల కదలికలు, అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. అంతేకాకుండా, నైట్ పెట్రోలింగ్ టీమ్స్ కు ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్లను అందజేశారు. అనుమానం వచ్చిన వ్యక్తులకు అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు నిర్వహించి, వాస్తవాలను నిర్ధారించేలా ఇన్స్టంట్ టెస్టింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. నేరగాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉండాలనే లక్ష్యంతో ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు.
హాస్టళ్లపై ఉక్కుపాదం - మేనేజ్మెంట్లకు వార్నింగ్
సరూర్ నగర్ పరిధిలోని హాస్టళ్లలో ఇప్పటికే పోలీసులు ప్రత్యేక ఆడిట్ నిర్వహించారు. హాస్టల్ నిర్వాహకులు తప్పనిసరిగా హై-రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు లేదా మాదకద్రవ్యాల వినియోగానికి సహకరించే హాస్టళ్లను తక్షణమే సీజ్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. సుమారు 3,200 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నారు.
పాన్ షాపులపై నిఘా.. కఠిన చట్టాలు
నిషేధిత పదార్థాలను విక్రయిస్తున్నట్లు అనుమానం ఉన్న పాన్ షాపులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నార్కోటిక్స్ పంపిణీలో భాగస్వాములయ్యే వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. స్థానిక నివాసితులు, పాదచారులు తమ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
యువతకు బలమైన సందేశం - కెరీర్ ముఖ్యం
ఈ సందర్భంగా సీపీ సుమతి విద్యార్థులకు కీలక సందేశం ఇచ్చారు. క్షణికానందం కోసం డ్రగ్స్ బారిన పడితే మీ ఉజ్వల భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుంది అని హెచ్చరించారు. ఒక్క ఎన్డీపీఎస్ కేసు నమోదైనా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడమే కాకుండా, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. 15 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సున్న యువత విద్య, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సారించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.
గత అనుభవాల నుంచి పాఠాలు
సికింద్రాబాద్ డీసీపీగా పనిచేసిన కాలంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకుంటూ.. అక్రమ లాడ్జీలు డ్రగ్స్ కేంద్రాలుగా మారకుండా ఉండేందుకు ఇప్పుడు మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన గ్రౌండ్ లెవల్ సర్వైలెన్స్ ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. కేవలం శిక్షించడం మాత్రమే కాకుండా, డ్రగ్స్ అలవాటున్న యువతకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేందుకు పునరావాస కేంద్రాల సహాయం కూడా తీసుకుంటున్నట్లు వివరించారు.
ట్రెండింగ్ వార్తలు




















