Online Betting: ఆన్లైన్ బెట్టింగ్లో భారీ నష్టాలు.. చోరీలు, హత్యలు చేస్తున్న కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్
Constable Betting Debts in Siddipet ఆన్లైన్ బెట్టింగ్స్లో లక్షల రూపాయలు పోవడం, అప్పులు పెరగడంతో హత్యలు చేసి క్యాష్ రికవరీ చేసుకుంటున్నారు కానిస్టేబుల్ దంపతులు.

Online Betting Case | సిద్దిపేట జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్స్ వ్యసనం ఓ పోలీసు కానిస్టేబుల్ను హంతకుడిగా మార్చింది. భార్యతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్స్ పెట్టి భారీగా నష్టపోయాడు. ఓ వైపు అప్పులు, మరోవైపు నష్టాలు పెరిగిపోవడంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భావించారు. చివరకు హత్య చేసి జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు.
సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపిన ప్రకారం... సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరుకు చెందిన గౌటి ప్రవీణ్కుమార్ 2007లో పోలీస్ శాఖలో చేరగా, ప్రస్తుతం సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల కిందట రజితతో వివాహం జరిగింది. గత రెండేళ్లుగా తన భార్య రజితతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్స్ వేస్తున్న ప్రవీణ్ దాదాపు రూ.60 లక్షల వరకు నష్టపోయాడు. మరోవైపు అప్పుడు సైతం పెరిగిపోయాయి. దాదాపు రూ.30 లక్షల మేర అప్పులు కావడంతో వాటిని తీర్చేందుకు అడ్డదారిని ఎంచుకున్నారు. అందుకోసం హత్యలు చేయడానికి కూడా ఈ భార్యభర్తలు వెనుకాడటం లేదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిని నమ్మించి తీసుకెళ్లి హత్య..
స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి బెల్దె విశ్వనాథం(57)ను లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో ఒక ప్లాటు విషయంలో విశ్వనాథంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న ప్రవీణ్, మరో ప్లాటు చూపిస్తానని నమ్మించి గత శనివారం ఆయనను తమ కారులో మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే విశ్వనాథం కాళ్లు, చేతులు కట్టేసి, మెడకు వైరు బిగించి భార్య రజితతో కలిసి విశ్వనాథంను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేశారు. విశ్వనాథం వద్ద ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని హైదరాబాద్లో అమ్మేసి క్యాష్ చేసుకున్నారు.
విశ్వనాథం కనిపించకపోవడంతో ఆయన భార్య వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులకు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ ఫుటేజీ, టెక్నాలజీ సహాయంతో నిందితులను గుర్తించారు పోలీసులు. కానిస్టేబుల్ ప్రవీణ్, అతని భార్య రజిత ఈ హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసు టీంను కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.
తాళి చోరీ చేసిన కానిస్టేబుల్ దంపతులు
హత్య కేసులో అరెస్టయిన కానిస్టేబుల్ ప్రవీణ్, అతని భార్య రజిత అంతకుముందే మరో తప్పు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఏప్రిల్ 25న తమ ఇంటి సమీపంలోనే నివసించే బొడ్డు నర్సవ్వ అనే వృద్ధురాలికి అనారోగ్యంగా ఉందని నమ్మించి, ఆసుపత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో ఆమెకు డౌట్ రాకుండా మెడలోని తాళి దొంగిలించారు.
ఈ చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్లో అమ్మగా దాదాపు రూ.5 లక్షల వరకు వచ్చాయి. ఆ మొత్తాన్ని కూడా కానిస్టేబుల్ ప్రవీణ్ దంపతులు ఆన్లైన్ బెట్టింగ్లోనే పెట్టి పోగొట్టారు. తమకేం తెలియదు అని నిరూపించుకునేందుకు మరుసటి రోజు ప్రవీణ్ స్వయంగా బాధితురాలిని తీసుకుని వెళ్లి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. పోలీసు అయి ఉండి, నేరం చేసి మళ్ళీ బాధితురాలి వెంటే ఉండి డ్రామా ఆడటం స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















