Mobile Phone Death: గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
Mobile Phone Head Injury Death: ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో ఘోర విషాదం. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, భార్య మొబైల్ ఫోన్తో తలపై కొట్టడంతో స్వప్నేశ్వర్ మిశ్రా అనే యువకుడు మృతి చెందాడు.

Domestic Violence Odisha Husband Dies: ఓ చిన్నపాటి కుటుంబ కలహం ఎంతటి ఘోర విషాదానికి దారితీస్తుందో చెప్పడానికి ఒడిశాలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. నిత్యం మనం చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్.. ఒకరి ప్రాణాలను బలితీసుకుంటుందని ఎవరూ ఊహించలేరు. ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో భార్యాభర్తల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. తీవ్ర కోపోద్రిక్తురాలైన భార్య, భర్త తలపై మొబైల్ ఫోన్తో బలంగా కొట్టడంతో అతను మరణించిన ఈ విచిత్ర, విషాద ఉదంతం వైరల్గా మారింది.
బోలాంగిర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమ్నిభటి పాడ ప్రాంతానికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా అనే యువకుడికి, అతని భార్యకు మధ్య వీకెండ్లో ఒక్కసారిగా పెద్ద గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఆ సమయంలో తీవ్రమైన ఆగ్రహానికి లోనైన భార్య.. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను తీసుకుని భర్త తలపై అత్యంత బలంగా బాదింది. మొబైల్ ఫోన్ గట్టిగా తగలడంతో స్వప్నేశ్వర్ తలకు తీవ్ర గాయమై, రక్తం కారడం ప్రారంభమైంది.
గాయం తీవ్రతను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని బోలాంగిర్లోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చేరిన స్వప్నేశ్వర్కు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కొంత సమయం పాటు వైద్యుల పరిశీలనలో ఉంచిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ప్రాణాపాయం తప్పిందని భావించిన ఆసుపత్రి సిబ్బంది, అదే రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. దాంతో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే స్వప్నేశ్వర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తీవ్ర శ్వాసకోస ఇబ్బంది, నొప్పితో అతను స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. కంగారుపడిన బంధువులు సమయం వృథా చేయకుండా మళ్లీ అదే జిల్లా ఆసుపత్రికి పరుగు తీశారు. అయితే ఈసారి వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అంతర్గత గాయాల కారణంగా పరిస్థితి విషమించి స్వప్నేశ్వర్ శనివారం ఆసుపత్రిలోనే కన్నుమూశాడు.
భర్త మరణవార్త తెలుసుకున్న బోలాంగిర్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితురాలైన భార్యపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా కుటుంబ సభ్యులను, పొరుగువారిని విచారిస్తున్నారు. స్వప్నేశ్వర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మొబైల్ ఫోన్ దెబ్బ కారణంగానే తలలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందా లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడా అనేది పోస్ట్మార్టం నివేదికలో తేలనుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















