Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
Honor Killing in Macherla | పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో నిందితుల నుంచి లంచం తీసుకోవడంతో పాటు వారికి సహకరించారని నిర్ధారణ కావడంతో సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు.

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన ఘటనలో, ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారి నిందితులకు సహకరించడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ కేసులో మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. నిందితుల నుంచి భారీగా డబ్బు తీసుకుని, బాధితురాలి ప్రాణాలు పోవడానికి కారకులయ్యారన్న ఆరోపణలతో సీఐని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
మాచర్ల పట్టణానికి చెందిన వ్యాపారి చంద్రశీను, గంగ దంపతుల కుమార్తె చౌడేశ్వరి (22) పరువు హత్యకు గురైంది. తమ పక్కింటికి వచ్చే నాగరాజు అనే యువకుడితో చౌడేశ్వరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆమె తండ్రి మాత్రం చౌడేశ్వరిని గవర్నమెంట్ టీచర్కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. నిశ్చితార్థానికి సరిగ్గా రెండు రోజుల ముందు చౌడేశ్వరి తన ప్రియుడితో వెళ్లిపోయి పెద్దల్ని ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకుంది. నలుగురిలో పరువు పోయిందని, మరోవైపు మంచి సంబంధం తెస్తే చేసుకోకుండా నవ్వులపాలు చేసిందని భావించిన చంద్రశీను కుమార్తెపై కక్ష పెంచుకున్నాడు.
సీఐ సహాయంతో కుమార్తెను రప్పించిన తండ్రి
తన కుమార్తె ఇంట్లోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిందని తప్పుడు ఫిర్యాదు చేసి, పోలీసుల ద్వారా వారిని స్టేషన్కు రప్పించారు. చౌడేశ్వరి, నాగరాజు దంపతులు నరసరావుపేటలో తలదాచుకోగా, వారి ఆచూకీని కనిపెట్టిన పోలీసులు జంటను పీఎస్కు తీసుకెళ్లారు. తాను మేజర్నని, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని భర్తతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినప్పటికీ, డీల్ కుదుర్చుకున్న సీఐ ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఒక ఒప్పందం ప్రకారం ఆమెను 5 రోజుల పాటు పుట్టింటికి తీసుకెళ్లారు. తిరిగి భర్త దగ్గరకు వెళ్లాల్సిన మార్చి 19కి ఒకరోజు ముందే, అంటే మార్చి 18న చౌడేశ్వరి పుట్టింట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమెది హత్యేనని తేలింది.
పరువు తీసిందని చంపేశాను.. తండ్రి వాంగ్మూలం
పోలీసుల విచారణలో చంద్రశీను తన తప్పును అంగీకరించాడు. ప్లాన్ ప్రకారం తన భార్య, కుమారుడిని పొలానికి పంపి, మేనల్లుడు శీనుతో కలిసి నిద్రిస్తున్న చౌడేశ్వరి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. గుండెలపై ఆడించిన తానే, తన పరువు తీసిందని ఆమె మీద కూర్చుని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిలో తలవంపులు తేవడంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో పాటు సీఐ పాత్రను సైతం వెల్లడించాడు. జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో నిందితులను విచారిస్తున్నారు.
నిందితులకు సహకరించిన సీఐ, లంచం సైతం..
చౌడేశ్వరిని కుటుంబానికి అప్పగించిన తర్వాతే ఆమె హత్యకు గురైందని, ఆ సమయంలో సీఐ సెలవులో ఉన్నారని సమాచారం. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు పోస్టుమార్టం నివేదికను కూడా తారుమారు చేసేందుకు సీఐ వెంకటరమణ ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చౌడేశ్వరి ఆచూకీ కనిపెట్టి ఆమెను కుటుంబానికి అప్పగించేందుకు చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద రెండు విడతలుగా సీఐ నగదు తీసుకున్నట్లు విచారణలో తేలింది.
























