Hyderabad Drugs Party: హైదరాబాద్లోని రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు.. టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్
Hyderabad Drugs Case: గోల్కొండ లోని తారామతి బారాదరి రిసార్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రైవేట్ పార్టీపై ఈగల్ టీం, పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ టెస్టులు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.

Hyderabad Drugs Party | హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి రిసార్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్పై తెలంగాణ ఈగల్ (EAGLE) బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో చంద్ర అనే వ్యక్తి నిర్వహించిన ఈ పార్టీకి సుమారు 200 మంది హాజరయ్యారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ పోలీసుల అనుమతి లేకుండానే ఈ వేడుకను ప్రారంభించినట్లు సమాచారం.
మద్యం వినియోగానికి ఎక్సైజ్ శాఖ అనుమతి ఉన్నప్పటికీ, డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈగల్ డీఎస్పీ భిక్షపతి నేతృత్వంలోని బృందం గోల్కొండ పోలీసులతో కలిసి శనివారం రాత్రి అక్కడికి చేరుకుని ఒక్కసారిగా రిసార్టును ముట్టడించారు. ఎవరూ తప్పించుకోకుండా పకడ్బందీగా దాడులు నిర్వహించి, అనుమానం ఉన్న 36 మందికి డ్రగ్ కిట్లతో ఈగల్ టీం పరీక్షలు నిర్వహించింది.
డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, పరం సి నిహార్, ఆశి, జాసన్ సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, గతంలో కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించారా? ఎవరెవరికి విక్రయించారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ముగిసిన రోహిత్ రెడ్డి కస్టడీ
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. శనివారం వారిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచగా, సిట్ అధికారులు నిందితులను మరో మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు కస్టడీ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేస్తూ, నిందితులను చంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది.
ఇప్పటికే ఆరు రోజుల విచారణలో సిట్ పలు కీలక అంశాలను సేకరించింది. మార్చి 14న జరిగిన పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, విదేశీ పర్యటనలు, గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలపై పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెవరి ప్రమేయం ఉందనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
























