Hyderabad Drug Racket: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
Hyderabad Drugs Case | కుత్బుల్లాపూర్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసి నిందితుడి వద్ద కొకైన్, OG కుష్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి థాయ్లాండ్ వరకు డ్రగ్స్ కనెక్షన్ ఉందని పోలీసులు గుర్తించారు.

Hyderabad Drug Racket: కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ (DTF) బృందం మెరుపు దాడులు నిర్వహించి నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో సుమారు 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ (హైబ్రీడ్ గంజాయి) తో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును అధికారులు సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సికింద్రాబాద్ యాప్రాల్కు చెందిన వ్యాపారి ఇంజోత్ సింగ్ నగపాల్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై నుంచి థాయ్లాండ్ వరకు డ్రగ్స్ కనెక్షన్
నిందితుడిని విచారించగా విస్తుపోయే అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ వివరాలు బయటపడ్డాయి. ముంబైలోని డొంబివ్లికి చెందిన 'అబ్దుజు' అనే నైజీరియన్ వ్యక్తి ద్వారా కొకైన్ను, థాయ్లాండ్లోని పట్టాయాకు చెందిన 'నవి' అనే వ్యక్తి నుంచి ఓజీ కుష్ను నిందితుడు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు విదేశీయులు పరారీలో ఉన్నారు. నిందితుడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అత్యంత రహస్యంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, ఎవరికీ అనుమానం రాకుండా నిర్దేశిత ప్రదేశాల్లో డ్రగ్స్ దాచి ఉంచే "డెడ్ డ్రాప్స్" పద్ధతిలో సరఫరా చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ వెల్లడించారు.
పట్టుబడిన నిందితుడు ఇంజోత్ సింగ్ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ యాదయ్య నేతృత్వంలో నిందితుడిని మంగళవారం చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? కస్టమర్లు ఎవరు? అనే కోణంలో కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























