Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Bolla Brahmanaidu land scam: గండిపేటలో నకిలీ జీఓలతో రూ.1500 కోట్ల విలువైన భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారు. వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడే ఈ స్కెచ్ వేసినట్లుగా గుర్తించి కేసులు పెట్టారు.

Fake GO land fraud Hyderabad: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన గండిపేట భూ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేందుకు జరిగిన ఈ భారీ దందాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఉండటం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను
హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం, ఖానాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 111 , ఇతర కీలక సర్వే నంబర్లలో ఉన్న సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ కుంభకోణానికి కేంద్ర బిందువు. ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ. 1500 కోట్లు ఉంటుందని అంచనా. అత్యంత విలువైన ఈ భూమిని తమ పేరు మీదకు మార్చుకునేందుకు ఒక ముఠా అత్యంత నకిలీ పత్రాలను సృష్టించి, ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులనే ఫోర్జరీ చేయడం దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర
ఈ భారీ దందాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు బొల్లా రమేష్ పై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా 1993 , 2003 కాలం నాటి నకిలీ జీఓలను ఈ ముఠా సృష్టించింది. ఈ దందాలో ప్రధాన సూత్రధారులకు బ్రహ్మనాయుడు అండదండలు ఉన్నట్లు, భూ సెటిల్మెంట్లలో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ దస్తావేజులతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు వీరు భారీగా నగదు పంపిణీ చేసినట్లు సమాచారం.
ముగ్గురి అరెస్ట్ - దర్యాప్తు ముమ్మరం
ఈ భూ దందాలో చురుగ్గా పాల్గొన్న నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్ అనే ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే , ఆయన కుమారుడి లింకులు బయటపడ్డాయి. ఫేక్ జీఓలను నిజమైనవిగా నమ్మించేందుకు వీరు సెక్రటేరియట్ స్థాయి ముద్రలను కూడా వాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా’ లో ఉన్న భూములను క్లియర్ చేసేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ వేసింది.
రాజకీయ ప్రకంపనలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలపై హైడ్రా, ప్రత్యేక పోలీసు విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ తరుణంలో పక్క రాష్ట్రానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు ఈ కుంభకోణంలో రావడం రాజకీయ రంగు పులుముకుంది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాకుండా, ఈ దందాకు సహకరించిన రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు . నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు




















