Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో మోక్షమార్గం గుండా వెళ్తూ రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ చిక్కుకుపోయారు. ఊపిరాడక స్పృహకోల్పోయిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

Arunachalam Giri Pradakshina: తిరువణ్ణామలై: జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు భావిస్తారు. కానీ తన కోరిక తీర్చుకునేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన ఓ భక్తుడు మోక్ష మార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం ఇతర భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
కుటుంబంతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఏపీ భక్తుడు
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ గిరిప్రదక్షిణ మార్గంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం వారు భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ ప్రారంభించారు.
ప్రదక్షిణ దారిలో ఉన్న ఇడుక్కి పిళ్లైయార్ ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో, అక్కడ ఉండే అతి చిన్న మోక్షమార్గం గుండా వెళ్లేందుకు మణికుమార్ ప్రయత్నించారు. ఈ గుహ గుండా వెళ్తే కుటుంబ కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే ఆ చిన్న గుహ గుండా వెళ్తుండగా ఆయన మధ్యలోనే చిక్కుకుపోయారు. బయటకు రావడం సాధ్యం కాక, కఠిన పరిస్థితుల్లో గాలి ఆడకపోవడంతో ఊపిరాడక భక్తుడు స్పృహ కోల్పోయారు.
వెంటనే గమనించిన స్థానిక భక్తులు, కుటుంబ సభ్యులు అతికష్టం మీద ఆయనను బయటకు తీసి, అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మణికుమార్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ విషాద ఘటనపై తిరువణ్ణామలై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























