Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Crime | మాజీ డీజీపీ మనవరాలి పేరుతో నమ్మించి వారి అకౌంటెంట్ నుంచి రూ.1.2 కోట్లు దోచేశారు సైబర్ నేరగాళ్లు. మరోసారి మనీ కోసం మెస్సేజ్ రాగా మోసపోయినట్లు గుర్తించారు.
హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సామాన్యులే కాకుండా ఉన్నత అధికారుల కుటుంబ సభ్యులను సైతం వదలకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాజీ డీజీపీ మనవరాలి పేరుతో సైబర్ క్రిమినల్స్ భారీగా నగదు కాజేశారు. కోట్ల నగదు మోసపోయామని గుర్తించిన బాధితులు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ డీజీపీ మనవరాలు, మహిళా వ్యాపారవేత్త దివ్యారెడ్డి 18 కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మార్చి 13న సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్కు వాట్సాప్ మెస్సేజ్ చేశారు. తాను మీటింగ్ లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ.1.2 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ వాట్సాప్ అకౌంట్ పేరు, ఫొటోలు దివ్యారెడ్డివే ఉండటంతో నమ్మిన అకౌంటెంట్ మనీ పంపారు.
మనీ కోసం మరోసారి వాట్సాప్ మెస్సేజ్
మార్చి 17న మరోసారి అకౌంటెంట్కు నగదు పంపాలని మెస్సేజ్ వచ్చింది. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చెక్ అప్రూవల్ కోసం డైరెక్టర్ను సంప్రదించారు. ఇటీవల మనీ ట్రాన్స్ఫర్ చేయడం చర్చకు వచ్చింది. వాట్సాప్ మెస్సేజ్ రావడంతో కోటి ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు చెప్పగా.. తాను ఎవరికీ మనీ పంపాలని చెప్పలేదని దివ్యారెడ్డి చెప్పడంతో అకౌంటెంట్ క్లారిటీ ఇచ్చారు. విషయం గ్రహించిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నగదు మోసంపై ఫిర్యాదు చేశారు.
డిజిటల్ అరెస్టుల పేరుతో పెరుగుతున్న మోసాలు
సైబర్ నేరగాళ్లు కొందర్ని టార్గెట్ చేసి.. వారికి ఫోన్ చేసి, మీ పేరుతో వచ్చిన కొరియర్ పార్శిల్లో నిషేధిత డ్రగ్స్, పాస్పోర్టులు ఉన్నాయని నమ్మిస్తారు. ఈ కేసులో వారిపై ముంబై, చెన్నై, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారని, వెంటనే స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని భయపెడతారు. ఆపై డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్లైన్కు తీసుకుని యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వారిని అరెస్ట్ చేస్తున్నామని చెబుతున్నారు.
ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు పంపాలని వారు కోరతారు. భయాందోళనకు గురైన బాధితులు నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నారు. ఆ తర్వాత వారు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయని లేదా పోలీసులమని బెదిరిస్తే భయపడకండి. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఇలా ఫోన్లలో డబ్బులు అడగవని గ్రహించాలి. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 కి కాల్ చేయండి.























