Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Girl Molestation | చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ చూపి తీసుకెళ్లిన ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. హైదరాబాద్ లోని నార్సింగిలో ఈ దారుణం జరిగింది.

POCSO Act | నార్సింగి: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఒక ఆరేళ్ల అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి, ఆపై చిన్నారిని హత్య చేశాడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. తన గురించి చెబుతుందని పాపను హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం నుండి బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రి 10 గంటల సమయంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా, ఒక వ్యక్తి బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ ఆధారాలతో పోలీసులు నిందితుడిని వేగంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించి, అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బాలిక మృతదేహం ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి చూపించాడు.
పోలీసులు నిందితుడిపై అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఆశ చూపించి తీసుకెళ్లి హత్యాచారం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో బతకనివ్వొద్దని, ఉరితీసి చంపాలని డిమాండ్లు వస్తున్నాయి.
























