YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Mustafa Kidnap Case: గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కిడ్నాప్ కేసు, ఆముదాలవలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్పై మహిళా ఎస్సై దాడి కేసులతో వారిద్దరూ పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Guntur Srikakulam YSRCP Politics: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నియోజకవర్గ ఇన్ఛార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో చిక్కుకుని పోలీసు అరెస్టుల భయంతో వరసగా అజ్ఞాతంలోకి వెళ్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన స్థాయి నాయకులే వరుసగా పరారీలో ఉండడం, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం కేడర్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది.
కిడ్నాప్ కేసులో పరారీలో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నేత షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు మహమ్మద్ బషీర్లపై ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నూజివీడుకు చెందిన ఒక పొగాకు వ్యాపారి కుమారుడిని, లారీ డ్రైవర్ను కిడ్నాప్ చేసి గుంటూరులోని ఒక ప్రైవేట్ ప్రాంతంలో నిర్బంధించారనే ఆరోపణలతో వారిపై కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు గుంటూరులోని ముస్తఫా నివాసానికి వెళ్లినప్పటికీ, ఆయన తన కుమారుడితో సహా అప్పటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారీలోకి వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు.వారి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని కోరుతూ నూజివీడు పోలీసులు సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. ముస్తఫా, బషీర్ వివరాలు తెలిసిన వారు 9154876161, 9154876238 నంబర్లకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
పరారీలో చింతాడ రవికుమార్
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా బూర్జ మండలంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ప్రవల్లిక పట్ల రవికుమార్ , ఆయన అనుచరులు తీవ్రంగా ప్రవర్తించి, భౌతిక దాడికి దిగారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. విధులకు తీవ్ర భంగం కలిగించడం, మహిళా అధికారిపై దాడికి తెగబడటం వంటి అంశాలపై ఏ1గా చింతాడ రవికుమార్తో పాటు మొత్తం 21 మందిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో ఆయన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. చింతాడ రవికుమార్ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేస్తూ తాను కేవలం మహిళా ఎస్సైకి రక్షణగా ఉన్నానని, ఎలాంటి దాడికి పాల్పడలేదని వివరిస్తూ, చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటానని వెల్లడించారు.
పరారీలో ఉండటంతో ఏ క్షణమైనా అరెస్టు చేసే చాన్స్
రాష్ట్రంలో శాంతిభద్రతల ఉల్లంఘన, బెదిరించడం వంటి చర్య ల ను ఉపేక్షించేది లేదని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. గుంటూరు తూర్పు ముస్తఫా, ఆముదాలవలస చింతాడ రవికుమార్లను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీమ్స్ నిరంతరం డిజిటల్ ట్రేసింగ్ , రైడ్స్ నిర్వహిస్తున్నాయి. వరుసగా ముఖ్య నాయకులు చట్టపరమైన చిక్కుల్లో పడి పరారీ కావడం వైఎస్సార్సీపీకి క్షేత్రస్థాయి రాజకీయాల్లో పెద్ద తలనొప్పిగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















