అవును, కాంప్రహెన్సివ్ లేదా ప్యాకేజ్ బీమా ఉన్న వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదం జరిగితే, బీమా కంపెనీ పరిహారం చెల్లించాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
డ్రైవర్ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
వాహన ప్రమాదాల్లో కారులో లేదా ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వారికి కూడా బీమా పరిహారం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొత్త వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్పై కీలక సూచనలు చేసింది.

- కాంప్రహెన్సివ్ బీమా ప్రయాణికులందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టత నిచ్చింది.
- కొత్త వాహనాలకు దీర్ఘకాలిక TP బీమాను తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు కోరింది.
- బీమా లేని వాహనాలకు సాంకేతిక నియంత్రణ, ఈ-చలాన్లకు సుప్రీంకోర్టు సూచించింది.
- నాలుగు అంచెల బీమా, వినియోగదారులకు స్పష్టమైన కవరేజీని సుప్రీంకోర్టు సూచించింది.
Third party car insurance rules: రోడ్డు ప్రమాదాల్లో వాహనంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాంప్రహెన్సివ్ లేదా ప్యాకేజ్ బీమా పాలసీ ఉన్న వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి ప్రమాదం జరిగితే, బీమా కంపెనీ పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. మోటారు ప్రమాద పరిహారం కేసుల్లో కోర్టులు అత్యంత సాంకేతిక కారణాలను చూపి బాధితులకు న్యాయం నిరాకరించకూడదని కూడా స్పష్టం చేసింది.
వాహనంలో ఉన్న అందరికీ బీమా రక్షణ
1996లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో ఈ కీలక తీర్పు వెలువడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. కుటుంబ సభ్యులు బీమా కంపెనీ నుంచి పరిహారం కోరుతూ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. కారుకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, కారు యజమాని అదనపు "వ్యక్తిగత బీమా ప్రీమియం" చెల్లించలేదనే కారణంతో అప్పట్లో వారి అభ్యర్థనను ట్రైబ్యునల్ తిరస్కరించింది.
ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన కుటుంబానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కారుకు కాంప్రహెన్సివ్ బీమా ఉండటంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కూడా బీమా రక్షణ వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. 7.5% వడ్డీతో కలిపి మృతుడి కుటుంబానికి రూ.10,00,500 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ బీమా సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. కాంప్రహెన్సివ్ పాలసీ ఉన్న వాహనంలో కూర్చున్న వ్యక్తికి ప్రమాదం జరిగితే పరిహారం చెల్లించడం బీమా సంస్థ బాధ్యతేనని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో నో పెట్రోల్, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్?
ఇదే సమయంలో, దేశంలో థర్డ్ పార్టీ బీమా లేకుండా నడుస్తున్న వాహనాల సంఖ్యపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, బీమా నియంత్రణ సంస్థ చర్యలు తీసుకోవాలని సూచించింది.
కొత్తగా కొనుగోలు చేసే కార్లకు రిజిస్ట్రేషన్ సమయంలోనే నాలుగేళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించింది. అలాగే కొత్త ద్విచక్ర వాహనాలకు ఆరేళ్లపాటు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపింది.
బీమా లేకుండా వాహనాలు రోడ్డుపైకి రాకుండా సాంకేతిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని కూడా ధర్మాసనం సూచించింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను బీమా డేటాబేస్ & వాహన్ పోర్టల్తో అనుసంధానం చేసి, బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్గా ఈ-చలానాలు జారీ చేసే విధానాన్ని తీసుకురావాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్
పోలీసులు రియల్టైమ్లో వాహన బీమా వివరాలు తెలుసుకునే పరికరాలు లేదా మొబైల్ యాప్లు అందించాలని సుప్రీంకోర్టు సూచించింది. బీమా లేకుండా వాహనం నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ప్రైవేటు వాహనాలకు నాలుగు అంచెల బీమా విధానం అమలు చేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇందులో థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి కావాలని సుప్రీంకోర్టు తెలిపింది. వాహనంలో ప్రయాణించే వారు & పిలియన్ రైడర్లకు ప్రత్యేక పరిహార రక్షణ ఉండాలని పేర్కొంది. యజమాని, డ్రైవర్ & ప్రయాణికులకు వ్యక్తిగత ప్రమాద బీమా అందుబాటులో ఉండాలని సూచించింది. వాహనానికి కలిగే నష్టానికి సంబంధించిన కవరేజీని వినియోగదారుడి ఎంపికపై ఆధారపడే ఐచ్ఛికంగా ఉంచాలని తెలిపింది.
బీమా పాలసీల్లో ఒకే విధమైన నిబంధనలు & పదజాలం ఉండేలా బీమా నియంత్రణ సంస్థ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఏ కవరేజీలు తప్పనిసరి, ఏవి ఐచ్ఛికమో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసే సమాచార పత్రాన్ని అందించాలని సూచించింది. ప్రజలు ప్రయాణించే వాహనాలకు బీమా ఉందో లేదో సులభంగా తెలుసుకునే విధానాన్ని కూడా రూపొందించాలని ఆదేశించింది.
ఈ సూచనల అమలుపై కేంద్ర ప్రభుత్వం, బీమా నియంత్రణ సంస్థతో పాటు సంబంధిత అన్ని పక్షాలు ఈ నెల 14వ తేదీ (2026 ఆగస్టు 14)లోగా తమ సమాధానాలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
Frequently Asked Questions
కాంప్రహెన్సివ్ బీమా పాలసీ ఉన్న వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదం జరిగితే పరిహారం లభిస్తుందా?
కొత్త వాహనాలకు థర్డ్ పార్టీ బీమాకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం సూచించింది?
కొత్త కార్లకు రిజిస్ట్రేషన్ సమయంలో 4 ఏళ్ల, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
బీమా లేని వాహనాలను అరికట్టడానికి సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు సూచించింది?
బీమా డేటాబేస్తో అనుసంధానించబడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఉపయోగించి ఈ-చలాన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పోలీసులు బీమా వివరాలు తెలుసుకునే పరికరాలు కలిగి ఉండాలి.
సుప్రీంకోర్టు సూచించిన నాలుగు అంచెల బీమా విధానం ఏమిటి?
థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి, ప్రయాణీకులకు ప్రత్యేక పరిహారం, యజమాని/డ్రైవర్/ప్రయాణీకులకు వ్యక్తిగత ప్రమాద బీమా, వాహన నష్టం కవరేజీ ఐచ్ఛికం.
ట్రెండింగ్ వార్తలు






















