FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ ధరలను సవరించింది. నాన్-కమర్షియల్ వాహనాల పాస్ ధర రూ. 3,000 నుండి రూ. 3,075 కి పెరిగింది.

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మార్చి 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల వార్షిక పాస్ ధర స్వల్పంగా పెరగనుంది. ఇప్పటివరకు రూ. 3,000 గా ఉన్న ఈ పాస్ ధర ఇకపై రూ. 3,075 కి చేరుకుంటుంది.
ఏమిటీ వార్షిక పాస్?
తరచుగా హైవేలపై ప్రయాణించే వారి సౌకర్యార్థం 2025 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. పదేపదే టోల్ చెల్లింపులు చేసే అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. కేవలం నాన్ కమర్షియల్ అవసరాలకు వాడే ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఈ పాస్ సౌకర్యం వర్తిస్తుంది. వాలిడ్ ఫాస్ట్ట్యాగ్ కలిగిన ఏ ప్రైవేట్ కారు యజమాని అయినా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.
వాలిడిటీ వివరాలు
ఈ పాస్ యాక్టివేట్ అయిన తర్వాత ఒక ఏడాది కాల పరిమితి ఉంటుంది. లేదా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల గుండా 200 సార్లు ప్రయాణించే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అది ముగిసినట్లుగా పరిగణిస్తారు. హైవే నెట్వర్క్లోని వివిధ ప్లాజాల వద్ద ఉండే టోల్ ధరలతో సంబంధం లేకుండా ఈ పాస్ ద్వారా ప్రయాణించే వీలుంటుంది.
పాస్.. బంపర్ హిట్
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, ఈ ఇయర్లీ పాస్ పథకం వాహనదారుల్లో విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వాడుతున్నారు. జాతీయ రహదారులపై ప్రైవేట్ కార్లు జరిపే మొత్తం టోల్ లావాదేవీల్లో దాదాపు 28 శాతం ఈ వార్షిక పాస్ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.
డిజిటల్ చెల్లింపులపై ఫోకస్
2016లో ప్రారంభమైన ఫాస్ట్ట్యాగ్ వ్యవస్థ దేశంలో ప్రధాన టోల్ చెల్లింపు విధానంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 11.86 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు జారీ కాగా, అందులో 5.9 కోట్ల ట్యాగ్లు యాక్టివ్గా ఉన్నాయి. జాతీయ రహదారుల టోల్ ఆదాయంలో 98 శాతానికి పైగా డిజిటల్ రూపంలోనే వస్తోంది. వినియోగదారులు రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ పాస్లను సులభంగా పునరుద్ధరించుకోవచ్చు. యూపీఐ, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తి చేసిన 24 గంటల్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది.























