Mahindra Outperforms Toyota and Kia: ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా ప్రభంజనం - ఎస్యూవీ అమ్మకాల్లో తిరుగులేని ఆధిక్యం.. దూసుకుపోతున్న స్కార్పియో, థార్!
2026 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా 6.6 లక్షలకు పైగా ఎస్యూవీలను విక్రయించి భారీ వృద్ధిని నమోదు చేసింది. టయోటా, కియా ఉమ్మడి అమ్మకాల కంటే మహీంద్రా ఒక్కటే ఎక్కువ వాహనాలను విక్రయించడం విశేషం.

Mahindra Outperforms Toyota and Kia Combined in FY26: ఇండియన్ ఆటోమొబైల్ రంగం లో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2026 ఆర్థిక సంవత్సరాన్ని (FY26) అత్యంత విజయవంతంగా ముగించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకంగా 6.6 లక్షలకు పైగా ఎస్యూవీలను (SUV) విక్రయించి మార్కెట్లో తన సత్తా చాటింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టయోటా, కియా వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ఉమ్మడి అమ్మకాల కంటే ఎక్కువ వాహనాలను మహీంద్రా ఒక్కటే విక్రయించడం విశేషం. దీనితో దేశంలో మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే కాకుండా, మారుతి సుజుకి తర్వాత పరిశ్రమలో రెండవ స్థానానికి చేరువవుతోంది. గత ఏడాదితో పోలిస్తే మహీంద్రా దాదాపు 20 శాతం వృద్ధిని నమోదు చేసింది.
టయోటా, కియా కంటే కూడా..
తాజా గణాంకాల ప్రకారం, ఎఫ్-వై 26 లో మహీంద్రా మొత్తం 6,60,276 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అదే సమయంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ 3,67,152 యూనిట్లు, కియా ఇండియా 2,89,035 యూనిట్ల అమ్మకాలకే పరిమితమయ్యాయి. ఈ రెండు కంపెనీల మొత్తం విక్రయాలను కలిపినా మహీంద్రా అమ్మకాల కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం భారతీయ కస్టమర్లు సెడాన్లు, హ్యాచ్బ్యాక్ కార్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే ఎస్యూవీల వైపు మొగ్గు చూపుతుండటం మహీంద్రాకు బాగా కలిసొచ్చింది.
స్కార్పియో - థార్ హవా..
మహీంద్రా విజయ ప్రస్థానంలో 'స్కార్పియో' బ్రాండ్ కీలక పాత్ర పోషించింది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్ మోడళ్లు కలిపి ఏడాదికి 1,78,800 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి కావడం విశేషం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ 'థార్' ఏకంగా 50 శాతం వృద్ధిని నమోదు చేసి 1.26 లక్షల యూనిట్ల మార్కును అందుకుంది. థార్ వెయిటింగ్ పీరియడ్ చాలా నెలలు ఎక్కువగా ఉన్నప్పటికీ కస్టమర్లు ఈ కారు కోసం వేచి ఉండటం దీని క్రేజ్ను తెలియజేస్తోంది.
పోర్ట్ఫోలియో మొత్తం వృద్ధి..
కేవలం ఒకటి రెండు మోడళ్లు మాత్రమే కాకుండా మహీంద్రా లోని దాదాపు అన్ని వాహనాలు మంచి ప్రదర్శన కనబరిచాయి. పాత తరం మోడల్ అయిన 'బొలెరో' ఇప్పటికీ 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలతో తన బలాన్ని చాటుకుంది. ఇక ఎక్స్యూవీ300 స్థానంలో వచ్చిన 'ఎక్స్యూవీ 3XO' ఒక లక్ష యూనిట్ల అమ్మకాలతో సబ్-ఫోర్ మీటర్ సెగ్మెంట్లో నిలకడగా కొనసాగుతోంది. ఎక్స్యూవీ700 అమ్మకాలు స్వల్పంగా తగ్గినా, ఎలక్ట్రిక్ విభాగంలో కొత్తగా వచ్చిన ఎక్స్యూవీ 9e (XUV 9e), బీఈ 6 (BE 6) మోడళ్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా మహీంద్రా తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. నాణ్యత, పవర్, స్టైల్ కలగలిసిన వాహనాలను అందిస్తుండటంతో మహీంద్రా ఇప్పుడు భారతీయ రోడ్లపై కింగ్ అనిపించుకుంటోంది. ఏదేమైనా అటు సంప్రదాయ వెహికల్స్ తో పాటు ఇటు ఎలక్టిక్ వాహనాల్లోనే మహీంద్ర రాణించి, సత్తా చాటుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















