Barrier Free Tolling on National Highways: హైవేలపై ఇక దూసుకెళ్లడమే - టోల్ గేట్ల వద్ద బారియర్లు మాయం.. డిసెంబర్ 2026 నుండి కొత్త వ్యవస్థ అమలు..
నేషనల్ హైవేలపై ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కేంద్రం బారియర్ లేని టోల్ వ్యవస్థను తెస్తోంది. దీనివల్ల వాహనాలు ఆగకుండానే టోల్ చెల్లింపులు జరిగి సమయం ఆదా అవుతుంది.

India to Roll Out Barrier Free Tolling on National Highways: దేశ రహదారి ప్రయాణంలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వేచి ఉండే అవసరం లేకుండా, నేరుగా దూసుకెళ్లేలా 'బారియర్-ఫ్రీ టోలింగ్' (Barrier-free tolling) వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. డిసెంబర్ 2026 నాటికి ఎంపిక చేసిన జాతీయ రహదారులపై ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ ఫ్లోను మెరుగుపరచడం, క్యూ లైన్లను తొలగించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
అసలేమిటి ఈ బారియర్-ఫ్రీ టోలింగ్?
మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీ ఆధారంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపేందుకు ఫిజికల్ బారియర్లు (గేట్లు) ఉంటాయి. కానీ కొత్త పద్ధతిలో అటువంటి బారియర్లు ఏమీ ఉండవు. రోడ్డుకు అడ్డంగా అమర్చిన ఫ్రేమ్స్కు హై-టెక్ సెన్సార్లు, కెమెరాలు ఉంటాయి. వాహనం ఆ పాయింట్ దాటినప్పుడు అవి ఆటోమేటిక్ గా వాహనాన్ని గుర్తించి టోల్ ఛార్జీలను కట్ చేస్తాయి. లాజిస్టిక్స్ శక్తి సమ్మిట్ 2026లో గడ్కరీ ఈ వివరాలను వెల్లడించారు. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి మౌలిక సదుపాయాలు ఆధునీకరణ చెందుతాయని ఆయన పేర్కొన్నారు.
ఏఐ కెమెరాలు - ఫాస్టాగ్ పనితీరు..
ఈ కొత్త వ్యవస్థలో ఫాస్టాగ్ (FASTag) తో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీని అనుసంధానం చేస్తారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన హై-పర్ఫార్మెన్స్ ఏఐ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్ను రీడ్ చేస్తాయి. అదే సమయంలో ఆర్ఎఫ్ఐడీ (RFID) రీడర్లు ఫాస్టాగ్ స్టిక్కర్ను స్కాన్ చేస్తాయి. దీనివల్ల టోల్ మొత్తం నేరుగా లింక్ అయిన అకౌంట్ నుండి కట్ అవుతుంది. ఒకవేళ ఫాస్టాగ్ పనిచేయకపోయినా లేదా లేకపోయినా, నంబర్ ప్లేట్ ఆధారంగా వాహన యజమానిని గుర్తించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల పొరపాట్లు జరిగే అవకాశం చాలా తక్కువ.
ప్రయాణికులకు కలిగే లాభాలు..
డ్రైవర్లకు ఈ సరికొత్త అనుభవం ఎంతో ఊరటనిస్తుంది. టోల్ పాయింట్ల వద్ద వేగం తగ్గించాల్సిన పని లేకుండా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించవచ్చు. టోల్ బూత్ ఆపరేటర్లతో మాట్లాడటం లేదా చిల్లర కోసం వెతుక్కోవడం వంటి సమస్యలు ఉండవు. ఈ విధానం వల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా, వాహనాలు ఐడ్లింగ్ (ఆగి ఉండటం) లో ఉండవు కాబట్టి ఇంధనం కూడా ఆదా అవుతుంది.
కఠినమైన నిబంధనలు - జరిమానాలు..
టోల్ చెల్లించకుండా తప్పించుకునే వాహనాల కోసం ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. టోల్ కట్ అవ్వని వాహనదారులకు వెంటనే ఈ-నోటీసులు పంపుతారు. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ సస్పెండ్ చేయడమే కాకుండా, వాహన్ (VAHAN) డేటాబేస్ ద్వారా పెనాల్టీలు విధిస్తారు. నగదు చెల్లింపులకు అవకాశం లేకపోవడం వల్ల అందరూ డిజిటల్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ప్రస్తుతం ఏడాదికి రూ. 50,000 నుండి 60,000 కోట్ల వరకు టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే లీకేజీలు తగ్గి ఏడాదికి రూ. 8,000 కోట్ల వరకు అదనపు ఆదాయం లేదా పొదుపు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్ వంటి సంస్థల అధ్యయనం ప్రకారం.. మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల ఇప్పటికే లాజిస్టిక్స్ ఖర్చులు 16 శాతం నుండి 10 శాతానికి తగ్గాయి. దీన్ని మరింత తగ్గించి అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం.
ట్రెండింగ్ వార్తలు





















