E20 కాదు, కలుషిత ఇంధనమే అసలు సమస్య? - పెట్రోల్ బంకులపై స్వతంత్ర తనిఖీలకు ఆటోమొబైల్ కంపెనీల డిమాండ్
E20 ఇంధనం అమలైన తర్వాత వాహనాల్లో స్టాలింగ్ & స్టార్టింగ్ సమస్యలు పెరగడంతో పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యతను స్వతంత్రంగా పరీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆటో కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

E20 Fuel Concerns: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగం విస్తరించిన తర్వాత కొంతమంది వాహన యజమానులు స్టాలింగ్, స్టార్ట్ కావడంలో ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధన నాణ్యతను స్వతంత్రంగా పరీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, అసలు సమస్య E20 ఇంధనంలో లేదని, E20కు అనుగుణంగా రూపొందించిన వాహనాల్లో ఈ ఇంధనం సక్రమంగానే పనిచేస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే కలుషితమైన లేదా కల్తీ అయిన ఇంధనమే వాహనాల్లో తలెత్తుతున్న సమస్యలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నాయి. ఇదే ఆందోళనను పలువురు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
E20 ఇంధనంలో తేమ & క్లోరైడ్
ఇటీవల వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై నిర్వహించిన పరిశీలనల్లో కొన్ని ఇంధన నమూనాల్లో తేమ & క్లోరైడ్ స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎథనాల్లో ఉండే నీటిని సులభంగా పీల్చుకునే లక్షణం.
ఇది కూడా చదవండి: ఫుల్ ఛార్జ్పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్
E20 కోసం తగిన నిల్వ ఏర్పాట్లు లేవు
ప్రస్తుతం దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో ఉన్న భూగర్భ నిల్వ ట్యాంకులు & పైప్లైన్లు సాధారణ పెట్రోల్ కోసం రూపొందించబడ్డాయి. అధిక ఎథనాల్ మిశ్రమం కలిగిన ఇంధనాన్ని నిల్వ చేయడానికి అవసరమైన మార్పులు చాలాచోట్ల ఇంకా చేయలేదు. వర్షపు నీరు, గాలిలోని తేమ, కండెన్సేషన్ లేదా ఇంధనాన్ని సరఫరా చేసే ట్యాంకర్ల ద్వారా కూడా నీరు నిల్వ ట్యాంకుల్లోకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భూగర్భ ట్యాంకులో నీటి శాతం 0.5 శాతానికి మించి పెరిగితే ఎథనాల్ నీటితో కలిసి పెట్రోల్ నుంచి విడిపోతుంది. దీనినే 'ఫేజ్ సెపరేషన్' అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో పైభాగంలో పెట్రోల్ & అడుగుభాగంలో నీరు-ఎథనాల్ మిశ్రమం ఏర్పడుతుంది. ట్యాంకు దిగువ భాగం నుంచి ఇంధనం తీసుకున్న వాహనాల్లోకి ఈ నీటి మిశ్రమం వెళ్లే అవకాశం ఉండటంతో ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
అంతేకాకుండా, మైల్డ్ స్టీల్తో తయారైన పాత నిల్వ ట్యాంకులు & పైప్లైన్లు అధిక ఎథనాల్ మిశ్రమం కారణంగా తుప్పు పట్టే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఇంధన నాణ్యత మరింత దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 2026 మారుతి బ్రెజ్జా రెడీగా ఉంది - కొత్త టర్బో ఇంజిన్, ADAS, వెంటిలేటెడ్ సీట్లతో అదిరిపోయే ఎంట్రీ!
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఇంధన నాణ్యతను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే తనిఖీ చేస్తున్న విధానాన్ని మార్చాలని ఆటో పరిశ్రమ కోరుతోంది. ఇంధనాన్ని తయారు చేసే సంస్థలే దాని నాణ్యతను పరీక్షించడం సరైన విధానం కాదని పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనం ఉందో లేదో స్వతంత్ర సంస్థ పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
BIS మార్గదర్శకాల ప్రకారం E20 ఇంధనంలో అదనపు డిటర్జెంట్లు, డిస్పర్సెంట్లు, సిలికాన్, క్లోరిన్ ఆధారిత పదార్థాలు లేదా లోహ ఆధారిత యాడిటివ్లు ఉండకూడదు.
గత రెండేళ్లలో దేశంలో పెట్రోల్లో కలిపే ఎథనాల్ పరిమాణం దాదాపు రెట్టింపు అయింది. అయితే ఇంధనంలో ఎథనాల్ శాతం పెరిగినా, దానికి అనుగుణంగా నిల్వ ట్యాంకులు, పైప్లైన్లు, రవాణా వ్యవస్థలను ఆధునికీకరించలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్లే కలుషిత ఇంధనం ఘటనలు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టాలంటే పెట్రోల్ బంకుల వద్ద క్రమం తప్పకుండా నాణ్యత పరీక్షలు నిర్వహించే స్వతంత్ర వ్యవస్థ అత్యవసరమని ఆటో పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















