(Source: ECI | ABP NEWS)
Vijayawada- Hyderabad Traffic Jam: సొంతూళ్ల నుంచి తిరుగుప్రయాణం, హైదరాబాద్- విజయవాడ హైవేపై కి.మీ మేర ట్రాఫిక్ జామ్
Hyderabad- Vijayawada Traffic Jam: దసరా పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కావడంతో వరుసగా రెండో రోజు హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది.

Hyderabad- Vijayawada National High Way | హైదరాబాద్: దసరా సెలవుల అనంతరం ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దాంతో వరుసగా రెండోరోజు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జర్నీ టైం కంటే, ట్రాఫిక్ లో వేచి చూసే సమయమే ఎక్కువ అవుతోంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వరకు భారీ రద్దీ ఏర్పడింది. సోమవారం ఉదయం సైతం హైదరాబాద్కు వచ్చే ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ జామ్ సమస్య తప్పడం లేదు.
చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు ట్రాఫిక్ జామ్
నల్గొండ జిల్లాలో చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు 4 కిలోమీటర్ల వేర వాహనాలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనుల వల్లఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద, దండు మల్కాపురం, చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చింతలకుంట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయాయి.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం నుంచే ట్రాఫిక్ క్రమంగా పెరుగుతోంది. పండుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి తమ వ్యక్తిగత వాహనాలలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడంతో రోడ్లపై ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తోంది. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపున 9 టోల్ బూత్లను ప్రారంభించి వాహనాలను వేగంగా పంపుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
ప్రతి దసరా, సంక్రాంతికి ఇదే సమస్య
దసరా, సంక్రాంతి పండుగల సమయంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో ప్రతి ఏడాది ట్రాఫిక్ జామ్ కావడం తెలిసిందే. ఈ ఏడాది కూడా దసరా పండుగ చేసుకుని సొంతూళ్ల నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణాలు కావడంతో టోల్ ప్లాజాల వద్ద, కొన్ని జంక్షన్న వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నిలిచిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే సమయంలో రోజుకు కొన్ని వాహనాల చొప్పున వెళ్తాయని, కానీ రెండు రోజుల వ్యవధిలో దాదాపుగా అందరూ తిరుగు ప్రయాణం కావడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు.






















