TDP Leaders Suspension: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
TDP Adulterated liquor case : కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు విచారణకు ఆదేశించారు.

Tamballapalle liquor case | అమరావతి: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) చర్యలు చేపట్టారు. దాసరిపల్లి జయచంద్రా రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేశారు. వారిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టిడిపి నేత జయచంద్రారెడ్డి ఓటమి చెందారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జయచంద్రారెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులు కల్తీ మద్యం తయారుచేస్తున్న ఈ కుటీర పరిశ్రమను సీజ్ చేశారు. అక్కడ జరిగిన తనిఖీల్లో రూ. కోటికి పైగా విలువైన నకిలీ మద్యం, తయారీకి ఉపయోగపడే యంత్రాలు, సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా 9 మందిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

గత కొన్ని నెలలుగా ఈ డంప్ రహస్యంగా నడుస్తోంది. టీడీపీ నేతలు స్థానికంగా రా మెటీరియల్స్ను సేకరించుకుని, ఆధునిక యంత్రాలతో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఆ మద్యాన్ని కదిరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు దర్జాగా సరఫరా చేస్తున్నారు. ఈ మద్యం తక్కువ ధరకు విక్రయించడం వల్ల భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. కానీ కల్తీ మద్యం సేవించడంతో స్థానికుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు గుర్తించి సీజ్ చేసిన ఈ డంప్లో 500 లీటర్లకు పైగా కల్తీ మద్యం, మిక్సింగ్ మెషీన్లు, బాటిలింగ్ యూనిట్లు, కెమికల్స్ వంటి ముడి సరుకును సీజ్ చేశారు.
శుక్రవారం నాడు ఎక్సైజ్ టీం, పోలీసులు ఆకస్మిక దాడులు
ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొలకలచెరువు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఒక గోదాములో ఈ డంప్ను గుర్తించారు. అక్కడ 9 మంది కల్తీ మద్యాన్ని బాటిల్స్లో ప్యాక్ చేస్తూ, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారని గమనించిన ఎక్సైజ్, పోలీసు టీమ్ దాడి చేసింది. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించినా, స్థానిక పోలీసులతో కలిసి ఎక్సైజ్ టీం అందరినీ అరెస్ట్ చేసింది. మొత్తం 15 ఎక్సైజ్ సిబ్బంది, 10 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. అరెస్టైన వారిపై ఎక్సైజ్ యాక్ట్లో సెక్షన్లు (8(1)(a), 34(ఎ)) ప్రకారం కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.






















