Kurnool Road Accident:కర్నూలు జిల్లాలో పెను విషాదం, మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం! 8 మంది భక్తులు మృతి!
Kurnool Road Accident:కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన భక్తులు.

Kurnool Road Accident: ఆధ్యాత్మిక యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో గురువారం వేకువజామున గుండెలు పిండేసే ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తుల వాహనాన్ని కాలయముడిలా వచ్చిన ఒక రెడీమిక్స్ లారీ బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాద తీవ్రత ెంత ఉందంటే, భక్తులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యి బోర్లా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 16 మంది ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. ఆసుపత్రిలో మరో ముగ్గురు కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి, డ్రైవర్ ఉన్నారు.
ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. చిలకలడోన వద్ద ఎదురెదురుగా వస్తున్న క్రమంలో, లారీ అతివేగంగా వచ్చి బొలెరోను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని, వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు.
గాయడిన 12 మందిని మొదట ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















