![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janasena News: పిఠాపురంలో పవన్ కొంపముంచేలా గుర్తుల కలకలం, జనసేన ఆరోపణలు - రంగంలోకి నాగబాబు
Pawan Kalyan News: పిఠాపురంలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసి స్క్రూటినీ పూర్తయ్యాక మళ్ళీ నామినేషన్ పత్రాలు ఎందుకు తెరిచారని జనసేన పార్టీ ప్రశ్నించింది.
![Janasena News: పిఠాపురంలో పవన్ కొంపముంచేలా గుర్తుల కలకలం, జనసేన ఆరోపణలు - రంగంలోకి నాగబాబు Janasena party accuses manipulations while nomination scrutiny in Pithapuram constituency Janasena News: పిఠాపురంలో పవన్ కొంపముంచేలా గుర్తుల కలకలం, జనసేన ఆరోపణలు - రంగంలోకి నాగబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/46f382c8f8acee9b3feb1f1033fea3461714401024663234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pithapuram Constituency: పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అధికారులు సార్వత్రిక ఎన్నికల నియమావళిని మార్చేసే ప్రయత్నం చేపట్టారని జనసేన పార్టీ ఆరోపించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసి స్క్రూటినీ కూడా పూర్తయ్యాక మళ్ళీ నామినేషన్ పత్రాలు తెరిచారని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. సదరు నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందని అన్నారు.
‘‘తెలుగు జాతీయ పార్టీ తరపున పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థి పిఠాపురంలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు.. నామినేషన్ దాఖలు చేసే సందర్భంలోనే బ్యాట్ గుర్తుతో పాటుగా మరొక రెండు గుర్తులు తమకు కేటాయించాల్సిందిగా ఎన్నికల కమిషన్ అధికారులను అభ్యర్థించారు. అభ్యర్థి స్క్రూటినీ పూర్తయిన తరువాత ఎన్నికల గుర్తును అభ్యర్తించే విషయంలో పొరపాటు జరిగిందని తెలుపుతూ, తనకు గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని చెప్తూ నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం పిఠాపురం అధికారులు చేశారు. అంతటితో ఆగకుండా సంబంధిత అభ్యర్థికి పెన్ స్టాండ్ గుర్తును కేటాయించే ప్రయత్నం కూడా ఎన్నికల కమిషన్ అధికారులు చేపట్టారు.
ఓట్లు బదలాయించే కుట్ర జరుగుతోందా..?
నామినేషన్ పత్రాలు అందజేసే విషయంలో పొరపాటు చేశాను అని స్వయంగా లిఖిత పూర్వకంగా రాసిచ్చిన అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించకుండా, దానిలో మరో అనుమానాస్పద పత్రాలు జత చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అడిగిన వెంటనే గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించే ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిస్తోంది. గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించడం ద్వారా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ కి వేసే ఓట్లను గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుకు బదలాయించే కుట్ర జరుగుతుందనే అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్వయంగా కార్యాలయానికి వెళ్లి పిఠాపురం అధికారులను సంబంధిత అంశం గురించి వాకబు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు’’ అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)