Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Fireworks Explosion In AP: కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడు ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణమైన మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Kakinada News Today | అమరావతి: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇటీవల బాణసంచా పేలి తీవ్ర విషాదం నింపడం తెలిసిందే. ఈ విస్ఫోటం ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 28 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ దుర్ఘటనలో, నిబంధనలకు విరుద్ధంగా ముడిసరకు సరఫరా చేసిన వ్యాపారిపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 28న జరిగిన ఈ ప్రమాదంలో సూర్యశ్రీ ఫైర్వర్క్స్ కేంద్రానికి అనుమతి ఉన్న దానికంటే వందల రెట్లు అదనంగా మందుగుండు నిల్వ ఉంచడమే ప్రమాదానికి దారితీసిందని అధికారులు నిర్ధారించారు.
15 కేజీలకు పర్మిషన్.. 500 కేజీలకు పైగా స్టోరేజీ ..
సూర్యశ్రీ ఫైర్వర్క్స్ యజమాని అడబాల అర్జున్కు కేవలం 15 కిలోల ముడిసరకు నిల్వ ఉంచుకోవడానికి మాత్రమే అధికారిక అనుమతి ఉంది. అయితే, విచారణలో అక్కడ సుమారు 500 నుండి 600 కిలోల భారీ స్థాయి మందుగుండు అనధికారికంగా నిల్వ ఉన్నట్లు తేలింది. అనుమతికి మించి భారీగా ముడిసరకు విక్రయించడాన్ని పోలీసులు తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దాపురానికి చెందిన ఓ వ్యాపారిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. యజమాని అర్జున్ ఒకరి వద్ద బిల్లులతో, మరో ఇద్దరి వద్ద బిల్లులు లేకుండా సరకు కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు, ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నారు.

ఫోరెన్సిక్ నిపుణులు ఏమన్నారంటే..
ఈ ఘోర ప్రమాదంపై ఫోరెన్సిక్ నిపుణులు కీలక అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ రోజు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు మందుగుండు దట్టింపు ప్రక్రియలో అంచనా తప్పడం వల్ల నిప్పురవ్వలు రేగి విస్ఫోటం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒక చోట భారీ పేలుడు సంభవించినప్పుడు, మంటలు పక్క షెడ్లకు వ్యాపించాల్సిన అవసరం లేదని, ఆ శబ్ద తీవ్రత, 360 డిగ్రీల కోణంలో వెలువడే కంపన తరంగాల (Shockwaves) వల్ల సమీపంలోని షెడ్లు కూడా పేలిపోతాయని ఫోరెన్సిక్ నివేదిక వివరించింది. గతంలో అనకాపల్లి జిల్లా నాతవరం పేలుడు ఘటనను అధ్యయనం చేసిన ముంబయి నిపుణులు కూడా వేట్లపాలెం కేంద్రాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది.

బాధితుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ పరిహారం
సామర్లకోట మండలం వేట్లపాలంలోని సూర్యశ్రీ ఫైర్వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి అదే రోజు 20 మంది చనిపోయారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పలువురు మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు స్వయంగా ఘటనా స్థలాన్ని అదేరోజు రాత్రి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు.
చనిపోయిన వారి పిల్లలకు చదవు చెప్పించడంతో పాటు నిరుపేదలకు సొంతిల్లు కట్టించి ఇస్తామని సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులకు సంబంధించిన ఆస్తులు వేలం వేసి బాధితుల కుటుంబాలకు పంచుతామని చంద్రబాబు అన్నారు. గతంలో జరిగిన ఘటనలపై పూర్తి దర్యాప్తు నివేదిక పరిశీలించి త్వరలోనే వీటిపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.
ట్రెండింగ్ వార్తలు




















