Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్, 28కి చేరిన మరణాలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఈ ప్రమాదం మృతుల సంఖ్య 28కి చేరుకుందని అధికారులు తెలిపారు.

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గత నెల 28న జరిగిన ఘోర బాణసంచా పేలుళ్ల ఘటనపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్ నిర్వాహకులైన అడబాల అర్జున్, అతని సోదరుడు నానిలతో పాటు, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి తండ్రి శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల్లో ఒకరైన అడబాల అర్జున్కు 15 కేజీల మందుగుండు సామగ్రితో బాణసంచా తయారు చేయడానికి ‘ఎల్ఈ1’ లైసెన్స్ ఉందని, అది 2024లో రెన్యువల్ అయ్యిందని ఎస్పీ వివరించారు. అలాగే, అతని సోదరుడు వీరబాబు (నాని)కి బాణసంచా విక్రయించుకోవడానికి ‘ఎల్ఈ5’ లైసెన్స్ ఉందని, అర్జున్ లైసెన్స్ గడువు ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగియాల్సి ఉందని పేర్కొన్నారు.
ప్రమాదానికి కారణం.. మరణాల వివరాలు
జగ్గంపేట మండలం మల్లిశాల చింతాలమ్మ జాతర కోసం భారీగా ఆర్డర్ రావడంతో, నిందితులు అనుమతించిన పరిమితికి మించి నిల్వ చేసి బాణసంచా తయారు చేసినట్లు విచారణలో తేలింది. తయారీ సమయంలో అనుకోకుండా నిప్పురవ్వ రాజేసుకోవడంతో మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం మరో ఇద్దరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా కఠిన చర్యలు:
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కాకినాడ జిల్లాలో ఉన్న 20 బాణసంచా తయారీ కేంద్రాలను, 8 మందుగుండు సామగ్రి సరఫరా కేంద్రాలను తక్షణమే సీజ్ చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. లైసెన్స్ నిబంధనలు అతిక్రమించినా లేదా భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..
బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 20 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం ఇచ్చే రూ. 2 లక్షలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు అందుతాయి. నగదుతో పాటు, నివాసం కోల్పోయిన పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని, బాధితుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు.
























