Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
Vetlapalem Fireworks Explosion | కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు.

Kakinada Fireworks Explosion | సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా, బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అదే సమయంలో ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు నలుగురు అధికారులు ఆర్డీఓ, డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ ను సస్పెండ్ తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని యంత్రాంగాన్ని హెచ్చరించారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆయన, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల్లో అత్యధికులు రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలు, మహిళలు ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం
బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని చాటుకుంది. బాణసంచా పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ. 20 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియాకు అదనమని ఆయన స్పష్టం చేశారు. అంటే బాధితులకు మొత్తం రూ. 22 లక్షల ఆర్థిక సాయం అందనుంది. కేవలం నగదు సాయమే కాకుండా, ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి, ఇళ్లు లేని పేద కుటుంబాలకు ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని.. చదువుకునే పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధితులు కోలుకునే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ కేంద్రాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపాలని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడా అనుమతులు లేని పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలు ఉండకూడదని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారు.

నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి, బాధితుల కుటుంబాలకు పంచుతాం..
నిబంధనల ప్రకారం పర్మిషన్ తో వీటిని నడపాలని, నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతడు ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొస్తాం అన్నారు. నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి, ప్రభుత్వం వాటిని వేలం వేసి బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి, చర్యలు తీసుకోవాలని సూచించారు.

పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న ఫైర్ క్రాకర్ కేంద్రాలను తనిఖీలలో ఎందుకు గుర్తించలేకపోతున్నారు, అందుకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. గతంలో ఓ ఘటన జరిగింది, దానిపై ఎంక్వైరీ వేశామన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన నిరుపేదలు ఇలా వేరే వాళ్లు చేసిన తప్పులకు బలికావడం సరికాదని, వారికి ఉపాధి హామీ లాంటి పథకాలు వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.

Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















