DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 3 విడతల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ - తెలంగాణ (DOST 2026) ద్వారా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలను 3 విడతలుగా నిర్వహించనున్నారు. విద్యార్థులు బుధవారం (ఈ నెల 15) నుంచి తొలి విడత ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోవాలి. మొత్తం మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, జూన్ 20 నుంచి 27 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 1వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ తదితరులు దోస్త్ షెడ్యూల్ను విడుదల చేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజు..
ఈ ప్రవేశాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ www.dost.cgg.gov.in లో ఏప్రిల్ 13న దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ఫీజు మొదటి విడతకు రూ. 200 చెల్లించాలి. ఒకవేళ రెండో విడత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 400 పేమెంట్ చేయాలి. గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ షెడ్యూలు..
తొలి విడత రిజిస్ట్రేషన్లు - ఏప్రిల్ 15 నుంచి మే 7వ తేదీ వరకు
వెబ్ ఆప్షన్లు - ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - మే 14
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 15 నుంచి 23వ తేదీ వరకు
రెండో విడత రిజిస్ట్రేషన్లు - మే 15 నుంచి మే 25వ తేదీ వరకు
వెబ్ ఆప్షన్లు - మే 15 నుంచి మే 26వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - మే 30
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 31 నుంచి జూన్ 5 తేదీ వరకు
మూడో విడత రిజిస్ట్రేషన్లు - మే 31 నుంచి జూన్ 15వ తేదీ వరకు
వెబ్ ఆప్షన్లు - మే 31 నుంచి జూన్ 16వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - జూన్ 20
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - జూన్ 20 నుంచి జూన్ 25 తేదీ వరకు
దోస్త్ పరిధిలోకి మరిన్ని కాలేజీలు..
ఈ సందర్భంగా దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గతేడాది వరకు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను సీపీగెట్ (CPGET) ద్వారా భర్తీ చేయగా, ఈసారి వాటిలోని మూడు మేనేజ్మెంట్ కోర్సులను దోస్త్ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం (2025-26)లో మొత్తం 4.40 లక్షల సీట్లు ఉండగా, 2.05 లక్షల సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల శాతం పెరగడంతో డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చని ఆశిస్తున్నారు. ప్రస్తుతం సొంతంగా జాయినింగ్స్ నిర్వహించుకుంటున్న 60 ప్రైవేటు కాలేజీలను సైతం దోస్త్ పరిధిలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
దోస్త్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. వీటితో పాటు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డీ ఫార్మసీ సీట్లను, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్)లోని ఒక కోర్సు సీట్లను కూడా దోస్త్ ద్వారానే భర్తీ చేయనున్నామని అధికారులు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















