Komatireddy Rajgopal Reddy: మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా - రేవంత్కు రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం
Rajagopal Reddy : మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని.. మాట నిలబెట్టుకోకపోతే ముఖ్యమంత్రిని అవుతానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Rajagopal Reddy ultimatum to Revanth: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టించారు. శుక్రవారం రాత్రి చౌటుప్పల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వండి.. లేదంటే నా తదుపరి లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీయే అంటూ ఆయన నేరుగా రేవంత్ రెడ్డికే అల్టిమేటం జారీ చేశారు.
నేనేరాజు..నేనే మంత్రి అని ప్రకటిస్తున్న రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో తనకు ఎదురు లేదని నేనే రాజు.. నేనే మంత్రి అంటూ తన పట్టును చాటుకుంటున్న తరుణంలో, రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ సీఎం వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత యుద్ధానికి సంకేతంగా కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి నిన్న మొన్నటిది కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని ఆయన పదేపదే గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే కేబినెట్లోకి తీసుకుంటామని మాట ఇచ్చారని, కానీ గెలిపించినా ఫలితం లేదని ఆయన ఆగ్రహంతో ఉన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటున్న కోమటిరెడ్డి
నాకు అడుక్కోవడం రాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి.. లేదంటే నేనేంటో చూపిస్తా అని రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదేళ్ల పాటు తానే పదవిలో ఉంటానన్న వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని, ఇక్కడ ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చని అప్పట్లోనే గళం విప్పారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, మీరు మునుగోడును చూసుకోండి.. నేను తెలంగాణను చూసుకుంటాను.. రాష్ట్రంలో నా జెండా పాతుతాను అని వ్యాఖ్యానించడం ద్వారా రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి సవాలు చేసినట్లుగా మాట్లాడుతురు.
ఎలాగైనా మంత్రి పదవి పొందాలనేదే టార్గెట్
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనను కాదని ఇతరులకు అవకాశం ఇవ్వడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. ఒకే జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉండకూడదనే నిబంధనను సాకుగా చూపుతున్నప్పటికీ, ఖమ్మం వంటి జిల్లాల్లో ఆ సూత్రం ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండగా, తాను పదవి ఆశించడంలో తప్పులేదని ఆయన వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, కాంట్రాక్టర్ల దోపిడీ జరుగుతోందని గతంలో చేసిన విమర్శలు కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి.
బెదిరిస్తే కాంగ్రెస్లో మంత్రి పదవులు వస్తాయా?
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో, రాజగోపాల్ రెడ్డి రూపంలో గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఈ దండయాత్ర లాంటి వ్యాఖ్యలు అధిష్టానాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. మరి హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిని బెదిరింపుల్ని ఎలా తీసుకుంటుందో చూడాల్సి ఉంది.























