Telangana Municipal Elections Results 2026: కరిగిపోతున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ - కేటీఆర్ సంతృప్తి వెనుక అసలు నిజమెంత?
BRS: ఓటు బ్యాంక్ తగ్గలేదని బీఆర్ఎస్ గాంభీర్యం చూపిస్తోంది. కానీ ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నది మాత్రం ఎన్నికలు నిరూపిస్తున్న సత్యం అని విశ్లేషణలు చూపిస్తున్నాయి.

BRS declining vote bank: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్టీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని ఆయన అంటున్నారు. అయితే కేటీఆర్ వ్యక్తం చేస్తున్న సంతృప్తిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయి ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ పునాదులు నెమ్మదిగా కదులుతున్నాయని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నప్పటి గణాంకాలతో నేడు తమ పార్టీని పోల్చుకుని కేటీఆర్ సంతోషపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏడు కార్పొరేషన్లలో అంతంతమాత్రం ఉనికి
ఈ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. రాష్ట్రంలోని ఏడు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోవడం. ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. నల్గొండ, నిజామాబాద్, రామగుండం, మహబూబ్నగర్, మంచీర్యాల, కొత్తగూడెం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా కనుమరుగైంది. ఈ ప్రాంతాల్లో బలమైన పట్టున్న నేతలు ఉన్నప్పటికీ బలం నిలుపుకోలేకపోాయరు. ఒకప్పుడు కంచుకోటలయిన నిజామాబాద్, కరీంనగర్ లలో బీజేపీ దూకుడు చూపించింది. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.
పరిమితమైన ప్రాంతాల్లోనే కనిపిస్తున్న బీఆర్ఎస్ బలం
హైదరాబాద్ శివార్లలో, ఉమ్మడి మెదక్ జిల్లా వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. గతంలో బీఆర్ఎస్ పట్టున్న దక్షిణ తెలంగాణ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ మయమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా పోతోంది. బీఆర్ఎస్ కేవలం కొన్ని వార్డులకే పరిమితం కాగా, పీఠాలను దక్కించుకునే సత్తాను కోల్పోయింది. కేటీఆర్ తన ప్రసంగాల్లో పార్టీ కరిగిపోవడం లేదని క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఓట్ల శాతం, వార్డుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
బీఆర్ఎస్కు హెచ్చరికల్లాంటివే!
మున్సిపల్ ఫలితాలను వార్డుల వారీగా విశ్లేషిస్తే, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ క్రమంగా ఇతర పార్టీల వైపు మళ్లుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు గతంలోలా కాకుండా ఈసారి మార్పు కోరుకున్నట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన ఈ క్షీణత మున్సిపల్ ఎన్నికల వరకు కొనసాగుతుండటం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రస్తుత ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటివి. కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా, పట్టణాల్లో కూడా పోగొట్టుకున్న పట్టును తిరిగి సాధించాలంటే కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది.
ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని కేటీఆర్, తమ పార్టీని కాంగ్రెస్ గత వైఫల్యాలతో పోలుస్తూ ఆత్మరక్షణలో పడ్డారు. కానీ, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పాత రికార్డులు కాకుండా వర్తమాన ఫలితాలే ప్రామాణికం. బీఆర్ఎస్ తన వ్యూహాలను మార్చుకోకపోతే, రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఈ మున్సిపల్ తీర్పు హెచ్చరిస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.























