Adilabad Bear: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ఎలుగుబంటి స్వైరవిహారం - పట్టుకునేందుకు భారీ ఆపరేషన్
Bear: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడి ఘటన పెను కలకలం రేపుతోంది. ఎలుగుదాడిలో ఒకరు చనిపోయారు.

Bear roaming on Telangana Maharashtra border: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సరిహద్దుల్లో ఎలుగుబంటి సృష్టించిన బీభత్సం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా దయాల్ ధన్నుర్ గ్రామ శివారులో పొలం పనుల్లో ఉన్న ఎనిమిది మందిపై ఒక ఎలుగుబంటి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే జరగడంతో అటవీ శాఖ యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది.
తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎలుగుబంటి
ఎనిమిది మందిపై దాడి చేసి తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ ఎలుగుబంటి, ఇప్పుడు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ సరిహద్దు గ్రామాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా బోథ్ మండలంలోని నిగిని, మర్లపెల్లి అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరించే అవకాశం ఉన్నందున, ఆ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రయాణికులకు, రైతులకు జాగ్రత్తలు
అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నిగిని గ్రామం నుండి మహారాష్ట్రలోని శివిని పట్టణానికి వెళ్లే రహదారిపై ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఈ మార్గంలో ఎవరూ వెళ్లవద్దని సూచించారు. అలాగే, పశువుల కాపరులు తమ పశువులను మేపడానికి అడవిలోకి తీసుకెళ్లవద్దని, రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఒంటరిగా అటవీ శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని ఖరాకండిగా చెప్పారు. మనుషులపై దాడి చేసి రక్తరుచి మరిగిన ఎలుగుబంటి ఎదురుపడితే ప్రాణాపాయం పొంచి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అటవీ శాఖ నిఘా
ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం పహారా కాస్తున్నారు. ఎలుగుబంటి కదలికలను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సమీప గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఏవైనా అసాధారణ శబ్దాలు లేదా కదలికలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మృగం పట్టుబడే వరకు ప్రజలు గుంపులుగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని డి.ఎఫ్.ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
























