MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Komatireddy Rajgopal Reddy | సొంత ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నిధులు మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని ప్రశ్నించారు.

Telangana Assembly Session | హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ, సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. నిధులు మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బయట టాక్ నడుస్తోందని, నా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏం తప్పు చేశారు? అధికారంలో ఉండి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతే నేను ఎమ్మెల్యేగా ఉండటం అనవసరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆకలి కోసం కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేశాం..
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పాటు సాగింది ఆకలి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవాన్ని వదులుకోరని ఈ ఉద్యమం నిరూపించింది. నాడు తెలంగాణ గొంతు వినిపించడం కోసం సొంత పార్టీని సైతం ఎదిరించి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కొడంగల్ అభివృద్ధి గురించి, ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ, భట్టి విక్రమార్క అధ్యక్షతన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటం వల్ల ఏ పథకం వచ్చినా అక్కడికే పోతోందనే మాట వినిపిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మునుగోడుకు అన్యాయం..
నా మునుగోడు ప్రాంతంలో ఒక్క లిఫ్ట్ లేదు, కాల్వ లేదు, కనీసం చెరువులు కూడా లేవు. మన (కాంగ్రెస్) ప్రభుత్వం ఉండి కూడా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే, ఒక ఎమ్మెల్యేగా మౌనంగా ఉండటం నేరం. నేను ఎవరి బెదిరింపులకు భయపడను, ప్రలోభాలకు లొంగను. నా ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండటం కూడా అనవసరమని భావిస్తున్నాను. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి. నా నియోజకవర్గానికి నిధుల కోసం నేను మంత్రులు, సీఎం చుట్టూ తిరగాలా? మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతే పదవి వల్ల ప్రయోజనం ఏముందని’ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలివే..
మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రమే బిల్లులు వస్తున్నాయని, మిగిలిన నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం అంటే కేవలం మంత్రులు మాత్రమే కాదని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం పట్ల సమాన బాధ్యత ఉండాలని ఆయన గుర్తు చేశారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ప్రతిసారీ మంత్రులు లేదా ముఖ్యమంత్రి చుట్టూ తిరగాలా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
మునుగోడు ప్రజలకు సాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందితే, ఒక శాసన సభ్యునిగా తన పదవిలో కొనసాగడం వ్యర్థమని రాజగోపాల్ రెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
ట్రెండింగ్ వార్తలు























