ఈనెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, అక్టోబర్ 10న వరంగల్ లో మహాసభ - కేటీఆర్
ఏప్రిల్ 25న నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలుకంటోన్మెంట్, గోషామహల్, భద్రాచలం ఇన్ ఛార్జీల నియామకం

విస్తృతంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల జరపాలని BRS నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పలు షెడ్యూల్స్ ప్రకటించారు. ఏప్రిల్ 25న నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఉంటాయి. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఆరోజు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదిస్తారు. అక్టోబర్ 10వ తేదీన వరంగల్ లో పార్టీ మహాసభ జరుగుతుంది. పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగించాలని సూచించారు. కంటోన్మెంట్, గోషామహల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు కేసీఆర్.
ఈనెల 25వ తేదీన రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ
ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు పార్టీ నియమించిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని కేటీఆర్ సూచించారు. గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్ధలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. 25వ తేదీన రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ జరగుతుందన్నారు. ఈ సమావేశాల్లో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500 -3000 మంది ప్రతినిధులతో నిర్వహించుటామన్నారు కేటీఆర్. అందరూ ఈ సమావేశాలకు హాజరయ్యేటట్లు సమన్వయం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలను కేసిఆర్ ఆదేశించినట్లు KTR తెలిపారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులను బాగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జీలకు కేటీఅర్ సూచన చేశారు.
ఏప్రిల్ 27న తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవం
BRS ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ఆ రోజున పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షుడు KCR అధ్యక్షతన జరిగే ఆ సమావేశంలో సూమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఉదయం కేసీఅర్ పార్టీ జెండాను ఎగరవేసి జనరల్ బాడీ సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదిస్తారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబర్ 10న వరంగల్ నగరంలో మహాసభ నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.
మే నెలాఖరు వరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా BRS నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పట్ల KCR పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు దాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని సూచించారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జీగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీగా ఎంపీ మాలోతు కవితలను అపాయింట్ చేశారు. వారు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉంటారు.






















