MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Danam Nagender Disqualification Petition | బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై పిటిషన్ కొట్టివేశారు.

Kadiyam Srihari Disqualification Petition | హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఈ నిర్ణయంతో పార్టీ మారారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఊరట లభించినట్లయింది. నిబంధనల ప్రకారం ఫిర్యాదులు లేవని లేక పార్టీ మారారని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమర్పించలేదనే కారణాలతో ఈ పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన వారిలో 10 మంది ఎమ్మెల్యేలు తదుపరి కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా, స్పీకర్కు నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం గతంలో సూచించింది. అయితే, తాజాగా స్పీకర్ ఇచ్చిన ఈ క్లీన్ చిట్ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.
గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ లకు ఇదివరకే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై విచారణ జరిపిన స్పీకర్ వీరిద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని నిరూపించడానిక సరైన ఆధారాలు లేవని, వారు సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. రాజ్యాంగాన్ని ఖూీన చేస్తున్నారని, తన హక్కులను స్పీకర్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ గుర్తుపై లోక్సభ ఎన్నికల్లో పోటీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్, తరువాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారని తెలిసిందే. ఓ సందర్భంలో తన రాజీనామా అంగీకరించాలని, దాంతో తనకు కాంగ్రెస్ లైన్ క్లియర్ అవుతుందని చెప్పారని ప్రచారం జరిగింది. దానం సైతం అదేతీరుగా వ్యవహరించారు. కానీ ఇటీవల రూటుమార్చిన దానం.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆ మాటలేంటి..
త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను కృషి చేస్తానని దానం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 300 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం (MIM) పార్టీల తరపున ప్రచారం చేస్తారని ప్రచారం జరిగింది. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిన ఆయన తాజాగా మాట మార్చారు.
పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, వ్యక్తిగత నిర్ణయాలతో కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ తనను ఎప్పుడూ వివరణ అడగలేదన్న దానం.. తనపై అనర్హత పిటిషన్ వేసిన వ్యక్తికి ఏం అర్హత, అధికారం ఉందని ప్రశ్నించారు.

























