GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
Godavari Pushkaralu Telangana: పన్నెండేళ్ళకోసారి జరిగే గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. 2027లో పుష్కరాలు జరగనున్నాయి..ఈ మేరకు తేదీలు ఖరారయ్యాయి..

Godavari Pushkaralu Dates 2027: ‘తెలంగాణ బ్రాండ్’ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళా తరహాలో పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు మార్చి 10న డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి సమావేశంలో .. వేదపండితులు నిర్ణయించిన పుష్కర తేదీలు ప్రకటించారు.
గోదావరి పుష్కర తేదీలు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి ఆది పుష్కరాలు
2028 జూలై 13 నుంచి జూలై 24 వరకు అంత్య పుష్కరాలు
సుమారు 8 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు తరలివచ్చే అవకాశం ఉందని..ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలని అధికారులకు సూచించారు క్యాబినెట్ సబ్ కమిటీ. గోదావరి నది ప్రవహించే జిల్లాల్లో, ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం సిద్ధం చేయాలన్నారు. గతంలో పుష్కరాల సమయంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని..గతంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం సహా ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రద్దీ అధికంగా ఉండే 9 ప్రాంతాలను ముందుగా టైర్ 1 కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయ లోపం లేకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా ప్రత్యేక అధికారులు, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ఘాట్ల దగ్గర ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఎమర్జెన్సీ దారులు, వైద్య సౌకర్యాలపై దృష్టిస్తారిస్తామన్నారు
‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగేలా, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను కమిటీ ఆదేశించింది. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్దత, భవిష్యత్ కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సరస్వతి పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతరను వైభవోపేతంగా నిర్వహించారని..అదే స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
12 సంవత్సరాలకు ఓసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సమయంలో పవిత్ర నదీ స్నానాలు, పితృ తర్పణాలు, ప్రత్యేక పూజలు ఆచరించడం ద్వారా విశేష పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం. తెలంగాణతో పాటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక కమిటీలతో భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీ, భద్రత కోసం AI సాంకేతికను వినియోగించనున్నారు. శాశ్వత ఘాట్ల నిర్మాణం, బఫర్ జోన్లు, తాత్కాలిక వసతి గృహాలు ఏర్పాటు చేస్తోంది. ఏడాది సమయం ఉన్నప్పుడే ఏర్పాట్లు మొదలుపెట్టారు కాబట్టి.. ఈ పుష్కరాల సమయంలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భరోసా ఇస్తున్నాయ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు..
























