Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Software Engineer Bhavana Protest: చిన్న చిన్న కారణాలకే ఉద్యోగుల్ని ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయి. ఓ మహిళా ఉద్యోగిని ఆరోగ్య కారణాలతో సెలవు పెడితే ఆమెను టెర్మినేట్ చేస్తూ మెయిల్ పంపారు.

Employee Termination Case Hyderabad: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా ఐటీ కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఓ ఉద్యోగిని ధర్నాకు దిగారు. భావన అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్, యాజమాన్యం తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందంటూ కంపెనీ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. తీవ్రమైన ఒత్తిడి, వేధింపులకు గురిచేస్తూ ఇష్టారీతిన ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ ఆమె చేపట్టిన ఈ నిరసన, ఐటీ వర్గాల్లోనూ, ఐటీ కారిడార్ పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
కుమార్తె అనారోగ్యం కారణంగా మూడు రోజుల సెలవు
బాధితురాలు భావన తెలిపిన వివరాల ప్రకారం, తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె ఐటీ కంపెనీ నిబంధనల ప్రకారమే మూడు రోజుల పాటు సెలవు కావాలని యాజమాన్యానికి ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించారు. చిన్నారి ఆరోగ్యం బాగోలేదనే కనీస మానవతా కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోని మేనేజ్మెంట్, సెలవు మంజూరు చేయకపోగా ఆమెపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు దిగిందని ఆరోపించారు. ఆ తర్వాత ఏకపక్షంగా ఆమెను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపి షాక్కు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లని ఆరోపణలు
కంపెనీలో ఉద్యోగులపై యాజమాన్యం తీవ్రమైన మానసిక ఒత్తిడిని తెస్తోందని, నిబంధనల పేరుతో కనీస ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తోందని భావన సంచలన ఆరోపణలు చేశారు. పనివేళల్లో వాష్రూమ్కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అత్యంత దారుణమైన వాతావరణం అక్కడ నెలకొందని ఆరోపించారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యలు , టుంబ అత్యవసర పరిస్థితులు ఉన్నప్పటికీ బలవంతంగా విధులకు హాజరు కావాలని ఒత్తిడి తెచ్చారని, సిక్ లీవ్లకు వేతనం చెల్లించకపోయినా సరే పనికి రావాలని ఈ-మెయిల్స్ ద్వారా వేధించారని ఆమె వాపోయారు.
పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసిన ఉద్యోగిని
కంపెనీ యాజమాన్యం అనుసరిస్తున్న ఈ అన్యాయమైన వైఖరిపై బాధితురాలు భావన ఇప్పటికే స్థానిక దుండిగల్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టెక్ మహీంద్రా యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని, తనకు పూర్తి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటంతో పాటు నిరసనను కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. మాతృత్వపు హక్కులను, ఉద్యోగుల ఆరోగ్య హక్కులను కాలరాస్తున్న సంస్థ తీరుపై ఐటీ ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంకా స్పందించని టెక్ మహింద్రా
టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగి ధర్నా చేపట్టడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ వేధింపుల ఆరోపణలు, ఉద్యోగి తొలగింపు వ్యవహారంపై టెక్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఐటీ రంగంలో పెరుగుతున్న జాబ్ సెక్యూరిటీ సమస్యలు, ఒత్తిడి వాతావరణానికి ఈ ఘటన మళ్లీ అద్దం పట్టింది.
Before You Go
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
ట్రెండింగ్ వార్తలు






















