First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్డ్రౌండ్ పూర్తి వివరాలివే
సుదీర్ఘకాలంగా అపస్మారక స్థితిలో ఉన్న హరీష్ రాణా కేసులో పాసివ్ ఇచ్చామరణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ తీర్పు తర్వాత ఆ కుటుంబం తమ కుమారుడికి బాధ నుంచి విముక్తి కలిగించనుంది.

భారత్లో ఇచ్చామరణం (Mercy Killing) గురించి మరోసారి చర్చ ఊపందుకుంది. సుదీర్ఘకాలంగా అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువకుడికి సుప్రీంకోర్టు పాసివ్ కారుణ్య మరణం (Passive Euthanasia) కల్పించడానికి అనుమతినిచ్చింది. ఈ తీర్పుతో ఏళ్ల తరబడి తమ కుమారుడిని ఈ స్థితిలో చూస్తున్న ఆ కుటుంబానికి ఓ మార్గం దొరికింది. దేశంలో కారుణ్య మరణాల రకాలపై, ఇవి ఎందుకోసం అవసరం అవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన హరీష్ రాణా గత 13 ఏళ్లుగా మంచంపై అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇన్నేళ్లలో కుమారుడి పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదని, డాక్టర్లు కూడా కోలుకునే అవకాశం లేదని చెప్పారని, తమకు 'పాసివ్ ఇచ్చామరణం' కోసం అనుమతించాలని అతడి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ కేసులో పాసివ్ ఇచ్చామరణానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. అసలు ఏ దేశంలో మొదట కారుణ్య మరణం అమలులోకి వచ్చింది? ఆ వ్యక్తి మరణాన్ని ఎందుకు ఎంచుకున్నారు? లేక కుటుంబసభ్యులు కోరారా వంటి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం
ఘజియాబాద్కు చెందిన హరీష్ రాణా 2013లో పంజాబ్ లోని చండీగఢ్లో చదువుకుంటున్న సమయంలో తన హాస్టల్ నాలుగో అంతస్తు నుండి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై మెదడు దెబ్బతింది. అప్పటి నుండి ఆయన అపస్మారక స్థితిలోనే ఉండి మంచానికే పరిమితమయ్యాడు. సుదీర్ఘకాలం పాటు ఇదే స్థితిలో ఉండటం వల్ల ఆయన శరీరపై గాయాలు (bed sores) కూడా ఏర్పడ్డాయి. డాక్టర్ల నివేదిక ప్రకారం, ఇన్నేళ్లలో అతడి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 'ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (AIIMS) నుంచి హరీష్ మెడికల్ రిపోర్టును కోరింది. అతడు కోలుకునే అవకాశం లేదని నివేదిక పేర్కొనడంతో, ఆ ప్రాతిపదికన కోర్టు పాసివ్ ఇచ్చామరణానికి (కారుణ్య మరణానికి) అనుమతించింది.
ఏ దేశంలో తొలి కారుణ్య మరణం
ప్రపంచంలో ఇచ్చామరణానికి (Euthanasia) చట్టబద్ధమైన గుర్తింపునిచ్చిన తొలి దేశం నెదర్లాండ్స్. ఏప్రిల్ 1, 2002న దీనికి చట్టబద్ధత కల్పించారు. ఈ చట్టం ప్రకారం అత్యంత కఠినమైన నిబంధనలతో రోగి తన ఇష్టపూర్వకముగా జీవితాన్ని ముగించడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత బెల్జియం, లక్సెంబర్గ్, కొలంబియా వంటి దేశాల్లో కూడా పలు నిబంధనల ఆధారంగా ఇచ్చామరణానికి (Mercy Killing) చట్టబద్ధత లభించింది.
స్విట్జర్లాండ్లో అసిస్టెడ్ సూసైడ్ (Assisted Suicide) వ్యవస్థ అమల్లో ఉంది. ఇందులో డాక్టర్ సహాయంతో ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో, కెనడాలో కూడా కఠినమైన నిబంధనలతో మెర్సి కిల్లింగ్కు అనుమతిస్తారు. అనేక దేశాల్లో ఇది ఇప్పటికీ చట్టవిరుద్ధం లేదా పరిమితంగా అమలు చేస్తున్నారు.
ఇచ్చామరణానికి చట్టబద్ధత కల్పించిన నెదర్లాండ్స్లో అనేక సంవత్సరాల పాటు సామాజిక, చట్టపరమైన చర్చలు జరిగాయి. దీని ప్రారంభం 1973 నాటి ప్రసిద్ధ పోస్ట్మా (Postma) కేసుతో జరిగిందని చెబుతారు. తీవ్రమైన అనారోగ్యంతో, భరించలేని బాధను అనుభవిస్తున్న తన తల్లి పదేపదే కోరడంతో ఒక డాక్టర్ ఆమె చనిపోవడంలో సహాయం చేశారు. ఈ కేసులో కోర్టు ఆ డాక్టర్ను దోషిగా తేల్చినప్పటికీ, చాలా తక్కువ శిక్ష విధించింది. అలాగే ఒక షేషెంట్ను వారి ఇష్టానికి వ్యతిరేకంగా నిరంతరం బాధలో బతికించడం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ ఘటన తర్వాత నెదర్లాండ్స్లో ఇచ్చామరణంపై చర్చలు ఊపందుకుని 2002లో దీనికి చట్టబద్ధత లభించింది.
























