Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్
మాతృభాషలో చార్జ్షీట్ రాయడం సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది. కానీ మొదటిసారి తెలుగులో చార్జీషీట్ రూపొంచి, కేసు వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు దుండిగల్కు చెందిన లేడి కానిస్టేబుల్

Telangana News: తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికార ప్రత్యుత్తరాలు అన్నీ ఇంగ్లీష్లో జరగడం సర్వసాధారణం. అటు గ్రామాల్లో ఇటు నగరంలో ఆంగ్ల భాష మీద పట్టులేని వాళ్లు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారు. అటువంటి వారు ప్రస్తుతం అందుబాటులో ఫోన్ ఉండటం వల్ల ఇంగ్లీషులో ఉన్న సమాచార కాపీని ఫోటో లేదా స్కాన్ చేసి వారికి వచ్చిన భాషలోకి అనువదించుకుని చదువుకుని అర్థం చేసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ దుండిగల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప, మాతృభాష తెలుగులో తన దర్యాప్తును కొనసాగించి, తెలుగు భాషలోనే ఛార్జీషీట్ దాఖలు చేయడం ద్వారా తెలంగాణ పోలీస్ శాఖలోనే కాదు , దక్షిణాది రాష్ట్రాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.
మాతృభాషలో కార్యాలయ విధులు సాధారణంగా ఉత్తర భారతదేశంలో జరగడం మనం చూస్తుంటాం. కానీ దుండిగల్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో 2025 సంవత్సరంలో తనకు కేటాయించిన ఓ రెండు కేసుల్లో పూర్తిగా తెలుగులో అభియోగపత్రం కోర్టుకు దాఖలు చేశారు. అందులో మొదటిది బౌరంపేట్కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి తన కిరాణా డబ్బాలో అక్రమంగా మద్యం నిల్వలు కలిగి,అమ్మకాలు చేస్తున్న కేసు. ఈ క్రమంలో దుండిగల్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి చివరగా దాఖలు చేసే అభియోగ పత్రాలు పూర్తిగా తెలుగులో మేడ్చల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కు సమర్పించారు.

మరో కేసులో ఓ మహిళా కూలీ, తన నాలుగేళ్ల కుమార్తెతోపాటు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య ,కూతరి కోసం భర్త ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో దుండిగల్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, కూతురి ఆచూకీ కోసం తన భర్త ద్వారా అందిన ఫిర్యాదులో వేగంగా స్పందించి కేసును ఛేదించి మహిళను, పాపను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు హెడ్ కానిస్టేబుల్ స్వరూపం. ఈ క్రమంలో తన దర్యాప్తు తుది నివేదికను తెలుగులో పూర్తి చేసి ఏసీపీ మేడ్చల్ శంకర్ రెడ్డికి సమర్పించారు. ఈ విధంగా ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికార భాష తెలుగులో దర్యాప్తును పూర్తి చేయడం ద్వారా మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడమే గాకుండా, ఇటీవల తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బంజారా హిల్స్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.






















